ప్రస్తుత కాలంలో జల, వాయు, భూమిపైనే జరిగే యుద్ధాలే కాకుండా సైబర్ యుద్ధం కూడా పొంచి ఉందన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్. వాటిని ఎదుర్కొనేందుకు మరింత సన్నద్ధం కావాలని సూచించారు. హైదరాబాద్ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఇవాళ(శనివారం) పాసింగ్ అవుట్ పెరేడ్ జరగగా… ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారు ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఇందులో హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియా కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన రాజ్ నాథ్ సింగ్… దేశానికి వాయు సేన అందిస్తున్న సేవలు అభినందనీయమని చెప్పారు. దుండిగల్ అకాడమీ ఎంతోమంది వీరులను దేశానికి అందించిందన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు వాయుసేన సిద్ధంగా ఉండాలన్నారు.
స్వదేశీ పరిజ్ఞానంతో రక్షణ రంగంలో ఎన్నో ఆవిష్కరణలు చేస్తున్నామని తెలిపారు రాజ్ నాథ్. రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ వాయుసేన అమ్ముల పొదిలో చేరడంతో వాయుసేనలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని తెలిపారు. భారత్ శాంతినే కోరుకుంటోందన్నారు. అయితే… ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదుల ఏరివేతకు కూడా రక్షణ దళాలు కృషి చేస్తున్నాయని తెలిపారు.