ఆమ్దానీ పెంచుకునేందుకు సర్కార్ కసరత్తు
ఆదాయమే లక్ష్యంగా వైన్ షాపులను పెంచేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. షాపుల లైసెన్స్ ఫీజులతో పాటు అప్లికేషన్ చార్జీలనూ భారీగా పెంచేందుకు ప్లాన్ చేస్తోంది. వాటి ద్వారా రూ.6 వేల కోట్లు రాబట్టాలని టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా 225 మద్యం షాపుల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
వైన్స్, బార్ల లైసెన్సుల్లో ఈసారి ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లనూ ఇవ్వాలని సర్కార్ నిర్ణయించినట్టు సమాచారం.
హైదరాబాద్, వెలుగు: ఆదాయమే లక్ష్యంగా వైన్ షాపులను పెంచేందుకు సర్కార్ కసరత్తులు చేస్తోంది. షాపుల లైసెన్స్ ఫీజులతో పాటు అప్లికేషన్ చార్జీలనూ భారీగా పెంచేందుకు ప్లాన్ చేస్తోంది. వాటి ద్వారా రూ.6 వేల కోట్ల రాబడిని రాబట్టేందుకు టార్గెట్గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అధికారులు ఇప్పటికే ఆ పనుల్లో బిజీబిజీ అయిపోయారు. అందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా 225 మద్యం షాపుల ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. వైన్స్, బార్ల లైసెన్సుల్లో ఈసారి ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లనూ ఇవ్వాలని సర్కార్ నిర్ణయించినట్టు సమాచారం.
జనం లెక్కను బట్టి ఫీజు
ఈ ఏడాది అక్టోబర్తో మద్యం పాలసీ గడువు తీరిపోనుంది. అందులో భాగంగానే కొత్త మద్యం పాలసీకి ప్రపోజల్స్సిద్ధం చేయాల్సిందిగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ను సర్కార్ ఆదేశించినట్టు తెలుస్తోంది. వివిధ ప్రాంతాల్లో మద్యం షాపుల వద్ద రద్దీ, మద్యానికి ఉన్న డిమాండ్ను బట్టి కొత్త షాపులను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రపోజల్స్ రెడీ చేస్తున్నట్టు చెప్తున్నారు. కొత్త మండలాలు, పంచాయతీలు ఏర్పాటవడంతో అక్కడ వైన్స్షాపులను పెట్టాలని సర్కార్ భావిస్తోంది. కొత్త పాలసీలో భాగంగా జనాభా లెక్కను బట్టి మద్యం షాపుల లైసెన్స్ ఫీజులను ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. 2019కి ముందు 4 శ్లాబులుగా లైసెన్స్ ఫీజులుండేవి. జనాభాను బట్టి ఆరు శ్లాబులకు మార్చారు. దీంతో ఇప్పుడు జనాభా శ్లాబ్ల వారీగా ఆ ఫీజులను 15 నుంచి 40 శాతం దాకా పెంచడంపై ప్రతిపాదనలను సిద్ధం చేయాల్సిందిగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ను సర్కార్ ఆదేశించినట్టు సమాచారం. సర్కార్ శ్లాబుల ప్రకారం పంచాయతీల్లో 15 శాతం, మండలాల్లో 25 శాతం, మున్సిపాలిటీల్లో 30 నుంచి 35 శాతం, 20 లక్షలకుపైగా జనాభా ఉన్న కార్పొరేషన్లలో 40 శాతానికిపైగా లైసెన్స్ ఫీజులను పెంచేందుకు సర్కార్ రెడీ అయింది. ప్రస్తుతం 5 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.50 లక్షల ఫీజు వసూలు చేస్తున్నారు. అదే 5 వేల నుంచి 50 వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.55 లక్షలు, 50 వేల నుంచి లక్ష జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.60 లక్షలు, జనాభా లక్ష నుంచి 5 లక్షలున్న ప్రాంతాల్లో రూ.65 లక్షలు, జనాభా 5 లక్షల నుంచి 20 లక్షల దాకా ఉన్న ప్రాంతాల్లో రూ.85 లక్షల ఫీజులను వసూలు చేస్తున్నారు. 20 లక్షల జనాభా దాటితే రూ.1.10 కోట్ల ఫీజు తీసుకుంటున్నారు.
టార్గెట్ డబుల్
2019లో ఆప్లికేషన్ఫీజును రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచారు. అప్పుడు 48,243 ఆప్లికేషన్లు రాగా.. టెండర్ అప్లికేషన్ ఫీజుతోనే సర్కార్కు రూ.972 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే, ఈసారి దానికి రెండింతల ఆదాయాన్ని అప్లికేషన్ ఫీజు ద్వారా రాబట్టాలని సర్కార్ భావిస్తోంది. ఇక లైసెన్స్ఫీజులతో ఏటా రూ.3200 కోట్ల చొప్పున రెండేండ్లలో రూ.6,500 కోట్ల రాబడి కోసం ప్లాన్ చేస్తోంది. దాంతో పాటు 12 ఏండ్ల తర్వాత తొలిసారి కొత్త లిక్కర్ షాపులను ఏర్పాటు చేసేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. ఇప్పుడు రాష్ట్రంలో 2,216 మద్యం షాపులుండగా.. మరో 225 షాపుల ఏర్పాటుకు ప్రపోజల్స్ను సిద్ధం చేస్తున్నారు. ఆ సంఖ్య మరింత పెరిగినా పెరగొచ్చని అధికారులు అంటున్నారు.
ఎస్సీలకు రిజర్వేషన్
ఈసారి కూడా లాటరీ విధానంలోనే వైన్ షాపులకు లైసెన్స్ఇవ్వనున్నారు. అయితే, టెండర్లు సహా ప్రతి దాంట్లోనూ దళితులకు రిజర్వేషన్లు ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు వైన్స్లలో 15% రిజర్వేషన్ను దళితులకు ఇచ్చేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఎస్టీలకు మరో 6% ఇవ్వాలని భావిస్తున్నారు. అందుకు ప్రత్యేక విధానాన్ని అమలు చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. అప్లికేషన్, లైసెన్స్ ఫీజుల్లో ఎస్సీ, ఎస్టీలకు రాయితీ ఇవ్వాలనే ప్రతిపాదననూ సర్కార్పరిశీలిస్తోంది. లాటరీలో వైన్ షాపు పొందిన దళితులకు దళితబంధు ద్వారా ఇవ్వాలని ఆలోచిస్తోంది.