హైదరాబాద్, వెలుగు: ఫార్మాస్యూటికల్ కంపెనీ జేబీ కెమికల్స్ & ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (జేబీ ఫార్మా) క్రిటికల్ హార్ట్ ఫెయిల్యూర్ డ్రగ్ "అజ్మర్దా" ధరను సుమారు 50 శాతం తగ్గించింది. దేశంలో 8 నుండి 12 మిలియన్ల మంది హార్ట్ ఫెయిల్యూర్తో ఇబ్బందిపడుతున్నారని వెల్లడించింది. సకుబుట్రిల్-వల్సార్టన్ ️ అనే పేటెంట్ మాలిక్యూల్తో అజ్మర్దా తయారవుతుంది. అజ్మర్డా 50 ఎంజీ ట్యాబ్లెట్ ధర గతంలో రూ. 78 కాగా, ఇప్పుడు ఇది రూ. 39.60లకు అందుబాటులో ఉంటుంది. ఈ సందర్భంగా జేబీ ఫార్మా డొమెస్టిక్ బిజినెస్ ప్రెసిడెంట్ దిలీప్ సింగ్ రాథోడ్ మాట్లాడుతూ, " అజ్మర్దా ట్యాబ్లెట్లను మరింత అందుబాటు ధరలో తీసుకురావాలని నిర్ణయించాం.
ధరల తగ్గింపు వల్ల నెలవారీ చికిత్స ఖర్చు రూ. 4500 నుండి రూ. 2200 లకు తగ్గుతుంది. ఆసుపత్రిలో చేరే ఖర్చును కనీసం రూ.లక్ష వరకు తగ్గించవచ్చు. హార్ట్ ఫెయిల్యూర్ చాలా డేంజర్. దీని గురించి అవగాహన పెంచుకోవడం కూడా చాలా ముఖ్యం. జేబీ ఫార్మా దేశవ్యాప్తంగా 300 లకుపైగా ‘హార్ట్ ఫెయిల్యూర్’ క్లినిక్లను కూడా ఏర్పాటు చేసి రోగులకు అవగాహన కలిగిస్తుంది. దీనివల్ల తగిన నిర్ణయాలు తీసుకుంటారు”అని ఆయన వివరించారు. సకుబుట్రిల్-వల్సార్టన్ మాలిక్యూల్పై ప్రస్తుతం స్విట్జర్లాండ్లోని నోవార్టిస్ ఏజీకి పేటెంట్ ఉంది. జేబీ ఫార్మా రూ. 246 కోట్లతో భారతదేశ ప్రాంతం కోసం నోవార్టిస్ నుండి అజ్మర్దా బ్రాండ్ను ఈ ఏడాది ఏప్రిల్లో కొనుగోలు చేసింది.