బిజినెస్ డెస్క్, వెలుగు: రాబోయే నాలుగయిదేళ్లలో దేశంలోని సిటీలలో వచ్చే కొత్త మాల్స్లో సగం ఢిల్లీ–-ఎన్సీఆర్, హైదరాబాద్ సిటీలలోనే రానున్నట్లు ఒక రిపోర్టు తెలిపింది. కొత్త బ్రాండ్లు వస్తుండటంతో పాటు, ఇప్పుడున్న బ్రాండ్లు విస్తరణ వైపు చూస్తుండటంతో రియల్ ఎస్టేట్ డిమాండ్ జోరందుకుంటుందని ఎనరాక్ కన్సల్టింగ్ తన రిపోర్టులో వెల్లడించింది. రిటెయిలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఆర్ఏఐ)తో కలిసి ఈ రిపోర్టు తయారు చేసినట్లు తెలిపింది. దేశంలోని ఏడు ప్రధాన సిటీలలో డెవలపర్లు 25 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త మాల్స్ ప్రాజెక్టులను చేపట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు ఈ రిపోర్టు పేర్కొంది. 2022 లో వినియోగం పెరగడంతో రిటెయిల్ మార్కెట్ బాగా ఊపందుకుందని, రియల్ఎస్టేట్ రంగానికి ఇది మేలు చేస్తుందని వెల్లడించింది. కొత్త మాల్స్లో 46 శాతం నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్), హైదరాబాద్ సిటీలలోనే వస్తున్నాయని, 19 శాతం వాటాతో బెంగళూరు ఆ తర్వాతి ప్లేస్లో ఉందని తెలిపింది.
2022లో 2.6 మిలియన్ చదరపు అడుగులలో మాల్స్...
ఏడు సిటీలలోనూ కలిపి 2022 లో 2.6 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో మాల్స్ ఏర్పాటయినట్లు ఎనరాక్ రిపోర్టు తెలిపింది. 2021 తో పోలిస్తే ఇది 27 శాతం ఎక్కువని పేర్కొంది. దేశంలోని ఏడు సిటీలలోనూ కలిపి మొత్తం 51 మిలియన్ చదరపు అడుగులలో మాల్స్ ఏర్పాటయినట్లు వెల్లడించింది. ఇందులో ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, బెంగళూరులకు 62 శాతం వాటాఉందని పేర్కొంది.
విస్తరణ బాటలో రిటైల్ చెయిన్లు
పెద్ద పెద్ద రిటెయిల్ చెయిన్స్ భారీగా విస్తరించాలని ప్లాన్లు వేస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా, ఆదిత్య బిర్లా వంటి పెద్ద గ్రూపులన్నీ ఆఫ్లైన్ రిటెయిల్ బిజినెస్లను పెంచాలని ప్రయత్నాలు సాగిస్తున్నాయి. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్తో పార్ట్నర్షిప్స్ ఏర్పాటులో రిలయన్స్ రిటెయిల్ తలమునకలుగా ఉందని ఎనరాక్ కన్సల్టింగ్ ఈ రిపోర్టులో పేర్కొంది. ఇంటర్నేషనల్ రిటెయిలర్ గ్యాప్తో కలిసి కొత్త స్టోర్లను ఈ కంపెనీ తెరవనుందని వెల్లడించింది. గేలరీస్ లాఫాయెట్తో ఇటీవలే ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటెయిల్ లిమిటెడ్ తాజాగా వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఆ కంపెనీతో కలిసి మన దేశంలో లగ్జరీ డిపార్ట్మెంటల్ స్టోర్లు, ఈ–కామర్స్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలనేది ఆదిత్య బిర్లా గ్రూప్ ఆలోచన. కొత్తగా వైట్కాలర్ ఉద్యోగాలలో చేరే వాళ్లు, ఇప్పటికే సంపాదన బాగున్న వారి వల్ల ప్రీమియం బ్రాండ్లకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.ఇండియా రిటెయిల్ మార్కెట్ 2032 నాటికి 2 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ మార్కెట్ సైజు 2021 లో 690 బిలియన్ డాలర్లుగా ఉంది.