న్యూఢిల్లీ: ఇన్ఫ్లేషన్ తగ్గించడంలో ఫెయిలయ్యారనే విమర్శలు ఎదుర్కొంటున్న ఆర్బీఐ తాను తీసుకున్న పాలసీలను సమర్ధించుకుంది. వడ్డీ రేట్ల పెంపును తొందరగా మొదలు పెట్టి ఉంటే ఎకానమీ అధ్వాన్నంగా తయారయ్యేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఫిక్కి బ్యాంకింగ్ కాన్ఫరెన్స్లో పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ ఎకానమీని ప్రపంచమంతా సానుకూలంగా చూస్తోందని, సమర్ధవంతంగా రికవరీ అవుతోందనే దృష్టితో చూస్తోందని అన్నారు. ముందుకెళ్లే కొద్దీ ఇన్ఫ్లేషన్ దిగొస్తుందని అంచనావేశారు. ఇన్ఫ్లేషన్ టార్గెట్ను మిస్ అయ్యామని ఒప్పుకున్న ఆయన, పరిస్థితులకు తగ్గట్టు తీసుకున్న నిర్ణయాలను అభినందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మానిటరీ పాలసీని ముందు నుంచే కఠినతరం చేసి ఉంటే దేశ ఎకానమీ, దేశంలోని ప్రజలు భారీ మూల్యం చెల్లించే వాళ్లని అభిప్రాయపడ్డారు. ‘ఎకానమీ భారీగా నష్టపోవడాన్ని అడ్డుకున్నాం. కరోనా సంక్షోభం నుంచి ఎకానమీ రికవరీ ప్రాసెస్కు అడ్డుపడాలని అనుకోలేదు’ అని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఎకానమీ నిలకడగా మంచి స్థితికి చేరుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. కరోనా సంక్షోభం టైమ్లో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. ఈ టైమ్లో ఎకానమీ రికవరీ అయ్యేందుకు ఆర్బీఐ మానిటరీ పాలసీని సరళతరం చేసింది. ఇన్ఫ్లేషన్ కొద్దిగా పెరుగుతుందని తెలిసినా, వడ్డీ రేట్లను పెద్ద మొత్తంలో తగ్గించింది. కరోనా సంక్షోభం తర్వాత ఎకానమీ రికవరీ అవుతున్నప్పటికీ, మరోవైపు ఇన్ఫ్లేషన్ గరిష్టాలకు చేరుకోవడం చూశాం. దేశంలో రిటైల్ ఇన్ఫ్లేషన్ను 2–6 శాతం రేంజ్లో ఉండేలా ఆర్బీఐ చూసుకోవాలి. ఒకవేళ ఫెయిలైతే ఇందుకుగల కారణాలను ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలి. ఆర్బీఐ పాలసీ కమిటీ ఈ రిపోర్ట్ను ఇవ్వడానికి గురువారం సమావేశం అవుతుంది. ఈ రిపోర్ట్ను పబ్లిక్కు రిలీజ్ చేయమని శక్తికాంత దాస్ అన్నారు.
యుద్ధంతో అంచనాలన్నీ తప్పాయ్..
కరోనా వలన 2020–21 లో నష్టపోయిన దేశ ఎకానమీ 2021–22 లో బౌన్స్ బ్యాక్ అయ్యిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వేగంగా రికవరీ అవుతోందని దాస్ పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా నిలకడగా వృద్ధి చెందుతుందని అంచనావేశారు. కాగా, టాప్ దేశాల సెంట్రల్ బ్యాంకులతో పోలిస్తే ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపును కొద్దిగా లేటుగా స్టార్ట్ చేసింది. ఈ ఏడాది మే నెలలో అన్షెడ్యూల్డ్ మీటింగ్ నుంచి వడ్డీ రేట్లు పెంచుతూ వస్తోంది. దీనిపై చాలా విమర్శలు వస్తున్నాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ కాకముందు వరకు దేశంలో ఇన్ఫ్లేషన్ 4.3 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనావేసిందని, ఎనలిస్టులు మాత్రం 5 శాతంగా ఉంటుందని అంచనావేశారని పేర్కొన్నారు. కానీ, యుద్ధం స్టార్ట్ అవ్వడంతో అందరి అంచనాలు తారుమారయ్యాయని తెలిపారు. అన్ని సెక్టార్లలో రికవరీ స్టార్టయ్యిందని, ఇందుకు ఆర్బీఐ సరియైన టైమ్లో తీసుకున్న పాలసీలే కారణమని చెప్పారు. 70 ఎకనామిక్ ఇండికేటర్లు ఆర్థిక వ్యవస్థ బాగుందనే సంకేతాలను ఇస్తున్నాయని వివరించారు. యూఎస్ ఫెడ్ ఎల్లప్పుడూ మానిటరీ పాలసీని కఠినతరం చేసుకుంటూ పోదని, వడ్డీ రేట్ల పెంపు ఒక్కసారి ఆగిపోతే ఇండియా వంటి దేశాల్లోకి క్యాపిటల్ ఇన్ఫ్లో తిరిగి స్టార్ట్ అవుతుందని శక్తికాంత దాస్ అన్నారు. రూపాయి పతనాన్ని ఎమోషనల్ యాంగిల్లో చూడొద్దని చెప్పారు.
ఈ నెలలోనే రిటైల్ డిజిటల్ రూపాయి..
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ని లాంచ్ చేయడం దేశ కరెన్సీ చరిత్రలో ఒక మైలు రాయి అని శక్తికాంత దాస్ అన్నారు. హోల్సేల్ డిజిటల్ రూపాయి మొదటి పైలెట్ ప్రాజెక్ట్ను మంగళవారం ఆర్బీఐ లాంచ్ చేసింది. ప్రభుత్వ సెక్యూరిటీ మార్కెట్లో ట్రాన్సాక్షన్లు చేసేటప్పుడు బ్యాంకులు ఈ డిజిటల్ కరెన్సీని ఇష్యూ చేస్తాయి. రిటైల్ సెగ్మెంట్లో కూడా డిజిటల్ రూపాయి పైలెట్ ప్రాజెక్ట్ను తీసుకురావడానికి పనులు జరుగుతున్నాయని, ఈ నెల చివరిలో ఈ డిజిటల్ రూపాయి లాంచ్ ఉంటుందని అన్నారు. అంటే సాధారణ వ్యాపారులు, ప్రజలు వాడుకునే డిజిటల్ కరెన్సీని త్వరలో లాంచ్ చేస్తామన్నారు. పైలెట్ ప్రాజెక్ట్ పూర్తయ్యాక కొంత మంది రైతులకు వ్యవసాయ రుణాలను డిస్బర్స్ చేస్తామని వివరించారు. 2023 లో ఇలాంటి లోన్లనే చిన్న వ్యాపారాలకు కూడా పొడిగిస్తామన్నారు. బ్యాంకులు టెక్నాలజీపై ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలని, ‘బ్రాంచ్’ మోడల్ దీర్ఘకాలం వరకు ఉంటుందని అన్నారు.