న్యూఢిల్లీ: బిజినెస్ను, వాల్యుయేషన్ను పెంచుకోవడానికి అదానీ గ్రూపు పెద్ద ప్లాన్లను రెడీ చేస్తోంది. ట్రిలియన్ డాలర్ల వాల్యుయేషన్లతో గ్లోబల్ కంపెనీగా ఎదగాలనే కలను నెరవేర్చుకోవడానికి పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేయనుంది. గ్రీన్ ఎనర్జీ , డేటా సెంటర్లు, ఎయిర్పోర్ట్లు, సిమెంట్, హెల్త్కేర్ వంటి వ్యాపారాల్లో ఈ గ్రూపు 150 బిలియన్ డాలర్లుకు పైగా పెట్టుబడి పెట్టనుంది. ఈ ఏడాది అక్టోబర్ 10న జరిగిన సమావేశంలో అదానీ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జుగేషిందర్ రాబీ సింగ్ గ్రూప్ ఈ విషయాన్ని చెప్పారు. 1988లో ట్రేడర్గా మొదలైన అదానీ క్రమంగా ఓడరేవులు, విమానాశ్రయాలు, రోడ్లు, పవర్, పునరుత్పాదక ఇంధనం, పవర్ ట్రాన్స్మిషన్, గ్యాస్ పంపిణీ వ్యాపారాల్లో వేగంగా విస్తరించారు. డేటా సెంటర్లు, విమానాశ్రయాలు, పెట్రోకెమికల్స్, సిమెంట్, మీడియా వ్యాపారాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. రాబోయే 5-–10 ఏళ్లలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాపారంలో 50-–70 బిలియన్ డాలర్లు, గ్రీన్ ఎనర్జీలో మరో 23 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని గ్రూప్ యోచిస్తోందని గౌతమ్ అదానీ చెప్పారు. ఇది పవర్ ట్రాన్స్మిషన్లో 7 బిలియన్ డాలర్లు, ట్రాన్స్పోర్ట్ యుటిలిటీలో 12 బిలియన్ డాలర్లు, రోడ్ రంగంలో 5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతుంది. క్లౌడ్ సేవలతో డేటా సెంటర్ వ్యాపారంలోకి కూడా వచ్చింది. ఎడ్జ్ కనెక్స్ భాగస్వామ్యంతో 6.5 బిలియన్ డాలర్లు పెట్టుబడిని రాబట్టింది. విమానాశ్రయాల కోసం మరో 9–-10 బిలియన్ డాలర్లను పక్కన పెట్టనుంది. ఏసీసీ, అంబుజా కంపెనీల్లో వాటాలను కొనడానికి 10 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసింది. రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడితో సంవత్సరానికి మిలియన్ టన్నుల పీవీసీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. బిలియన్ డాలర్ల పెట్టుబడితో సంవత్సరానికి 0.5 మిలియన్ టన్నుల స్మెల్టర్తో రాగిని తయారు చేస్తామని సింగ్అన్నారు.
భారీగా పెరిగిన మార్కెట్ క్యాప్...
ఈ గ్రూపు మార్కెట్ క్యాపిటలైజేషన్ 2015 సంవత్సరంలో 16 బిలియన్ డాలర్లు కాగా, 2022లో 260 బిలియన్ డాలర్లకు చేరింది. కేవలం ఏడేళ్లలో 16 రెట్ల కంటే ఎక్కువ పెరిగింది. ట్రిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ విలువైన కొన్ని కంపెనీలు మాత్రమే ఉన్నాయి. వీటిలో యాపిల్, సౌదీ ఆరామ్కో, మైక్రోసాఫ్ట్, గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ అమెజాన్ ఉన్నాయి. అదానీ గ్రూప్ తన ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్ పోర్ట్ఫోలియోను కూడా విస్తరించడానికి సిద్ధంగా ఉందని సింగ్ చెప్పారు. దీంతో ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద కంపెనీగా తాము ఎదుగుతామని అన్నారు. "అదానీ పోర్ట్స్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్, ఈ వ్యాపారాలన్నీ ఇన్ఫ్రాలో ఉన్నాయి యుటిలిటీ పోర్ట్ఫోలియో నాలుగు కోర్ పోర్ట్ఫోలియోల ద్వారా ఏర్పడింది" అని ఆయన చెప్పారు. మెటల్స్, మెటీరియల్స్ వ్యాపారంలో పవర్ లాజిస్టిక్స్ అతిపెద్ద భాగాలు కాబట్టి రాగి, అల్యూమినియం, సిమెంట్ వ్యాపారాలలోకి ప్రవేశించామని చెప్పారు. గ్రూప్ భవిష్యత్తు వృద్ధి ప్రణాళికలకు ఎనర్జీ చాలా ముఖ్యమని పేర్కొన్నారు. హైడ్రోజన్ - భవిష్యత్ ఇంధనం అని, దీనిని ఉత్పత్తి చేయడానికి చెయిన్ను నిర్మిస్తామని అన్నారు. అదానీ గ్రూప్లోని చాలా వ్యాపారాలు మంచి మార్జిన్లను సాధిస్తున్నాయి. పోర్ట్ల వ్యాపారం 70 శాతం ఆపరేషనల్ మార్జిన్లను సంపాదించింది. అదానీ టోటల్ గ్యాస్ 41 శాతం మార్జిన్లను ప్రకటించగా, అదానీ ట్రాన్స్మిషన్ ఆపరేటింగ్ మార్జిన్ 92 శాతంగా ఉంది. వ్యాపారాలు లాభదాయకంగా ఉన్నాయని, ఫ్రీ క్యాష్ ఫ్లోలూ బాగున్నాయని కంపెనీలు వర్గాలు తెలిపాయి. ఇబిటా విలువ 8 బిలియన్ డాలర్ల వరకు ఉంది. ఇందులో సుమారు 3.6 బిలియన్ డాలర్లను సర్వీసింగ్ డెట్ కోసం ఖర్చు చేస్తారు. 700 మిలియన్ డాలర్లు పన్ను చెల్లింపులకు వెళ్తాయి. క్యాపెక్స్ కోసం 1.8 బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తారు.