న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ఇదివరకు చాలా మంది సింపుల్గా, చాలా తక్కువ మంది బంధుమిత్రులతోనే పెళ్లి చేసుకున్నారు. ఈ మహమ్మారి ఎఫెక్ట్ ఇప్పుడు నామమాత్రంగానే ఉండటంతో వెడ్డింగ్ మార్కెట్ దేశమంతటా పుంజుకుంటున్నది. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ‘వెడ్డింగ్ సర్వీసు ప్రొవైడర్లు’ బిజీబిజీగా కనిపిస్తున్నారు. ఖరీదైన పెళ్లిళ్ల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. దీంతో గిఫ్టులు, దుస్తులు, ఫంక్షన్హాల్స్వంటి వ్యాపారాలు గాడినపడుతున్నాయి. మనదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్– మార్చి మధ్య పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు ఉంటాయి. ఇదేకాలంలో పెద్ద సంఖ్యలో హిందూ వివాహాలు జరుగుతుంటాయి. కోవిడ్ సమయంలో పరిమిత సంఖ్యలో అతిథులతో పెళ్లి చేయడానికి అనుమతించడం తెలిసిందే. ప్రస్తుత ట్రెండ్స్గురించి వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీ ‘సాఫ్రాన్ స్ట్రింగ్’ కో–ఫౌండర్ నేహా అరోరా మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా చాలా మంది బడ్జెట్/సింపుల్ వెడ్డింగ్లను ఎంచుకున్నారని, ఇప్పుడు పరిస్థితి మారిందని, లగ్జరీ వెడ్డింగ్ల బుకింగ్స్ తిరిగి మొదలయిందని అన్నారు. “మరికొంత మంది వ్యక్తులు వెల్కమ్ పార్టీలతో వీకెండ్ వెడ్డింగ్స్ను ఇష్టపడుతున్నారు. ఈ సందర్భంగా ఖరీదైన భోజనాలకు ఆర్డర్ ఇస్తున్నారు. చాలా కుటుంబాలు తమ పెళ్లిళ్లను కేవలం సాంప్రదాయ కార్యక్రమంగా చూడటం లేదు. అంతకుమించిన వేడుకగా పరిగణిస్తున్నారు. వేడుకలను జరుపుకోవడానికి ప్రజలు ఎంచుకునే విధానంలో గణనీయమైన మార్పు వచ్చింది ”అని ఆమె అన్నారు. ముంబయికి చెందిన క్రయోంజ్ ఎంటర్టైన్మెంట్ & వెడ్డింగ్ ప్లానర్స్ ఫౌండర్ అచింత్ నాగ్ మాట్లాడుతూ, తమ నగరంలోనూ లగ్జరీ వెడ్డింగ్స్ హడావుడి మొదలైందని చెప్పారు. ఇక నుంచి ఇవి కొనసాగుతూనే ఉంటాయని, వచ్చే నవంబర్ నుండి ప్రారంభమయ్యే తదుపరి వెడ్డింగ్ సీజన్లో బుకింగ్స్ గురించి తమకు చాలా ఎంక్వైరీలు వస్తున్నాయని ఆయన వివరించారు.
ఖర్చు పెరిగింది..
‘‘2019 నుండి వివాహ ఖర్చులు దాదాపు 30శాతం పెరిగాయి. కోవిడ్ దాడికి ముందు ఏడాదిలో మనదేశంలో లగ్జరీ వెడ్డింగ్స్ఎక్కువగా జరిగాయి. అప్పటి నుంచి పెద్దగా హడావుడి లేదు. మాన్పవర్, లేబర్, రవాణా ఖర్చులు ఆల్ టైమ్ హై లెవెల్లో ఉన్నాయి. అన్నింటికీ డిమాండ్ విపరీతంగా పెరిగినందున పెళ్లి మరింత ఖరీదైన వ్యవహారంగా మారింది. మంచి హోటళ్ల ధరలు కూడా 30శాతం పెరిగాయి. ఇది పూర్తిగా డిమాండ్–-సప్లై పద్ధతిలో నడిచే వ్యాపారం" అని నాగ్ చెప్పారు. మహమ్మారి ముందు ఖర్చులతో పోలిస్తే పెళ్లిళ్ల కోసం చేసే ఖర్చు దాదాపు రెట్టింపు అయిందని ఫెర్న్స్ ఎన్ పెటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది. ఎఫ్ఎన్పీ వెన్యూస్, ఎఫ్ఎన్పీ వెడ్డింగ్స్.. ఫెర్న్స్ ఎన్ పెటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంలో ఉన్నాయి. ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో తమ వ్యాపారం 2019 ఆదాయంతో పోలిస్తే 20శాతం పెరిగిందని ఈ సంస్థ తెలిపింది. పెళ్లిళ్ల ద్వారా వచ్చే ఆదాయం దాని మొత్తం వ్యాపారంలో 25శాతం ఉంది. ఇది సుమారు రూ.650 కోట్ల వరకు ఉంటుంది. వెడ్డింగ్ ప్లానింగ్ వెబ్సైట్ వెడ్మీ గుడ్ ఇటీవల విడుదల చేసిన రిపోర్టు ప్రకారం..సగటు బుకింగ్ మొత్తం కనీసం 16శాతం పెరిగింది. కానీ కొన్ని కేటగిరీల్లో మరింత పెరుగుదల ఉంది. వెడ్డింగ్- డెకరేటర్లు ఇప్పుడు 20శాతం ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఈ–ఇన్విటేషన్లకు డిమాండ్ పెరిగినా ఇన్విటేషన్ డిజైనర్ల రాబడి పెద్దగా పెరగలేదు. గత సంవత్సరం సగటు అతిథుల సంఖ్య180 ఉండగా, ఈ ఏడాది 40శాతం పెరుగుదల ఉందని కంపెనీ తెలిపింది. అత్యంత రద్దీగా ఉండే పెళ్లిళ్ల సీజన్ కోసం తాము ఎదురు చూస్తున్నామని లగ్జరీ హోటళ్ల కంపెనీ రోసేట్ హోటల్స్ & రిసార్ట్స్ సీఈఓ కుష్ కపూర్ తెలిపారు. 2019తో పోలిస్తే ఈ సంవత్సరం పెళ్లిళ్ల నుండి అధిక ఆదాయాన్ని సాధిస్తామని అన్నారు. ‘‘మాకు వచ్చే ఎంక్వైరీల సంఖ్య దాదాపు 30శాతం పెరిగింది. 2019తో పోలిస్తే ఆదాయంలో కనీసం 40శాతం పెరుగుదల ఉంటుందని ఆశిస్తున్నాం. ఇప్పుడు అతిథుల సంఖ్యపై ఎటువంటి పరిమితులు లేనప్పటికీ, ప్రజలు ఇప్పటికీ సన్నిహితుల సమక్షంలో పెళ్లిళ్లు జరుపుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఫుడ్, డ్రింక్స్ డెకర్ల కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నారు " అని కపూర్ వివరించారు.