దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రోహిత్ వేముల సూసైడ్ కేసులో కీలక మలుపులు తీరుగుతుంది. రోహిత్ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని పోలీసులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ కేసు శుక్రవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరగగా.. ఆధారాలు లేవని కోసు క్లోజ్ చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న పలు యూనివర్సిటీల్లో విద్యార్థులు ఆంధోళనలకు దిగారు. దీంతో తెలంగాణ పోలీస్ శాఖ ఈ కేసు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
హెచ్ సీయూ విద్యార్థి వేముల రోహిత్ కేసును రీఓపెన్ చేయాలని డీజీపీ రవి గుప్తా సైబరాబాద్ సీపీని ఆదేశించారు. రోహిత్ వేముల కేసు పునర్విచారణ చేయాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కేసు పునర్విచారణకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ హైకోర్టును తెలంగాణ పోలీస్ శాఖ పిటిషన్ దాఖలు చేయనుంది.
రోహిత్ ఆత్మహత్యకు అప్పటి వీసీ అప్పారావుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. యూనివర్సిటీ నిబంధనలకు లోబడే వైస్ ఛాన్సలర్ చర్యలు తీసుకున్నారని రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. అంతేగాకుండా రోహిత్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని తెలిపారు. తన కులానికి సంబంధించిన విషయంలోనే రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు పోలీసులు.
2016లో జనవరిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో పలువురు బీజేపీ నేతలు , అప్పటి వీసీ అప్పారావుపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే వీళ్లకు సంబంధం లేదని గత ప్రభుత్వం తేల్చింది. గత ప్రభుత్వం హయాంలోనే రోహిత్ కేసు విచారణ పూర్తి కాగా.. 2024 మార్చిలో క్లోజర్ రిపోర్టును ఫైల్ చేశారు సైబరాబాద్ పోలీసులు. ఇవాళ (మే 3న) హైకోర్టుకు సమర్పించారు.