బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్
ఖైరతాబాద్, వెలుగు: బీసీలకు తరతరాలుగా అన్యాయం జరుగుతోందని, కలసికట్టుగా లేకపోతే చట్టసభల్లో అడుగు పెట్టలేమని బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ చెప్పారు. గురువారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బీపీ మండల్104వ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ‘బీసీల స్థితి గతులు – భవిష్యత్ కార్యాచరణ’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దాదాపు 15 సంఘాల నాయకుల నాయకులు పాల్గొన్నారు.
కొత్తగా బీసీ పొలిటికల్జేఏసీ ఏర్పాటు చేశారు. రాష్ట్ర చైర్మన్ గా వనపర్తి జిల్లాకు చెందిన రాచాల యుగంధర్ గౌడ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యుగంధర్మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి జేఏసీ చైర్మన్ బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలకు అతీతంగా పొలిటికల్ జేఏసీకి ప్రతి ఒక్క బీసీ నాయకుడు మద్దతు ఇవ్వాలని కోరారు. మునుగోడు ఉప ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలకే టికెట్లు ఇవ్వాలని, లేనిపక్షంలో జేఏసీ తరఫున బీసీ అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకుంటామన్నారు. సమావేశంలో నాయకులు నరేందర్ గౌడ్, కుమారస్వామి, బాలరాజు గౌడ్, సత్తార్ సాహెబ్, శేఖర్, రామ్మూర్తి, నరేశ్చారి, పద్మ, శివ పాల్గొన్నారు.