- రెండు, మూడ్రోజులు సమావేశాలు
- సీఎం ఢిల్లీ నుంచి వచ్చాక తేదీలు ఖరారు
గణేశ్ నిమజ్జనం తర్వాత అసెంబ్లీ సెషన్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 26లోపు అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాల్సి ఉండడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మార్చిలో నిర్వహించిన బడ్జెట్ సమావేశాలు అదే నెల 26న ముగిశాయి. సమావేశాలు వాయిదా వేసిన 6 నెలల్లోపు తిరిగి నిర్వహించాల్సి ఉంది. రాష్ట్రంలో కరోనా తీవ్రతను బట్టి సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ నుంచి తిరిగొచ్చిన తర్వాత సమావేశాల తేదీలు ఖరారు చేస్తారని.. రెండు, మూడ్రోజుల పాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.
దళిత బంధుపై చర్చ..
దళిత బంధుపై అసెంబ్లీ, కౌన్సిల్ లో చర్చించనున్నట్టు తెలుస్తోంది. దళిత బంధు పథకాన్ని బడ్జెట్లోనే పెట్టినందున, దీనిపై సభలో తీర్మానం చేయాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పథకం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఎలా అమలు చేయబోతున్నామనేదానిపై అసెంబ్లీలో సీఎం క్లారిటీ ఇస్తారని చెప్తున్నారు. రాష్ట్ర హౌసింగ్ బోర్డు (అమెండ్మెంట్), కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ వర్సిటీ (అమెండ్మెంట్) ఆర్డినెన్స్ లను అసెంబ్లీ, కౌన్సిల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందాల్సి ఉంది. కనీసం మూడు రోజులు అసెంబ్లీ, ఒక రోజు కౌన్సిల్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.