న్యూఢిల్లీ: జీడీపీకి మైనింగ్ రంగం నుంచి ఆదాయాన్ని పెంచడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని 13 బంగారు గనుల బ్లాక్లను కేంద్రం ఈ నెలలో వేలం వేయనుంది. ఆంధ్రప్రదేశ్లోని 10 బ్లాకుల్లో ఐదు బ్లాకుల వేలం ఆగస్టు 26న జరగవచ్చని, మిగిలిన ఐదు బ్లాకులను ఆగస్టు 29న వేలానికి పెడతారని సమాచారం. ఆంధ్రప్రదేశ్లోని బంగారు గనులలో రామగిరి నార్త్ బ్లాక్, బొక్సంపల్లి నార్త్ బ్లాక్, బొక్సంపల్లి సౌత్ బ్లాక్, జవాకుల -ఎ బ్లాక్, జవాకుల -బి బ్లాక్, జవాకుల -సి బ్లాక్, జవాకుల -డి బ్లాక్, జవాకుల- ఇ బ్లాక్, జవాకుల -ఎఫ్ బ్లాక్లు ఉన్నాయి.
ఈ బంగారు గనుల కోసం టెండర్లను ఆహ్వానిస్తూ మార్చిలో నోటీసులు వచ్చాయి. ఉత్తరప్రదేశ్లో మిగిలిన మూడు బంగారు గనుల విషయంలో ఈ నెలలో వేలం జరగనుంది కానీ తేదీలను ప్రకటించలేదు. ఈ రాష్ట్రంలోని మూడు గనులలో, రెండు బంగారు గనులు --సోన్భద్రలోని సోనపహరి బ్లాక్, ధుర్వ-బియాదండ్ బ్లాక్--లో ఉన్నాయి. ఈ మూడు బంగారు గనుల అమ్మకానికి టెండర్లను ఆహ్వానిస్తూ మే 21న నోటీసులు జారీ అయ్యాయి.
వివిధ రాష్ట్రాలు ఈనెల నాలుగో తేదీనాటికి 199 మినరల్ బ్లాక్లను వేలం వేశాయి. 2015లో మైనింగ్ చట్టంలో సవరణ తర్వాత వేలం పద్ధతి ద్వారా ఖనిజ బ్లాకుల కేటాయింపు ప్రారంభమైంది. పోయిన ఆర్థిక సంవత్సరంలో 45 మినరల్ బ్లాక్లను అమ్మకానికి పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వాలు వేలం ద్వారా ఆదాయంలో చాలా మంచి వాటాను పొందుతున్నాయని కేంద్రం చెబుతోంది. వేలం నిబంధనలల్లో మార్పుల వల్ల పోటీ వాతావరణం పెరుగుతోందని, తద్వారా బ్లాక్ల వేలానికి మరిన్ని సంస్థలు వస్తున్నాయని కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ పేర్కొంది. రాష్ట్రాలు, పరిశ్రమ సంఘాలు సాధారణ ప్రజలతో సంప్రదింపుల తర్వాత నియమాలను మార్చామని తెలిపింది.