హైదరాబాద్, వెలుగు: ఏపీలోని అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, ఆమె భర్త కోటేశ్వరరావు-కు రూ.25 వేల వ్యక్తిగత పూచీకత్తుతో తెలంగాణ హైకోర్టు శుక్రవారం బెయిల్ ఇచ్చింది. బ్యాంక్ అధికారులు అరవిందాక్షన్, రాజ్కుమార్లకు కూడా బెయిల్ మంజూరైంది. సీబీఐ కోర్టు విధించిన జైలు శిక్ష అమలును నిలిపివేస్తూ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ.42.79 కోట్లు రుణం తీసుకుని మోసం చేసిన కేసులో కొత్తపల్లి గీత, ఆమె భర్త కోటేశ్వరరావుతో పాటు బ్యాంకు అధికారులకు సీబీఐ కోర్టు ఐదేళ్ల శిక్షను విధించింది. ఆ తీర్పును సవాలు చేస్తూ నలుగురు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు నలుగురికి బెయిల్ ఇచ్చింది. విచారణను డిసెంబర్ 16కి వాయిదా వేశారు.