క్యూ3లో 15 శాతం పెరుగుదల
రికార్డుస్థాయిలో ఎగుమతులు
న్యూఢిల్లీ: మనదేశంలోని అతిపెద్ద వాహన కంపెనీల్లో ఒకటైన బజాజ్ ఆటో గత ఏడాది డిసెంబరు 31తో ముగిసిన మూడో క్వార్టర్లో రూ.1,262 కోట్ల లాభం సంపాదించింది. అంతకుముందు ఏడాది క్రితం క్యూ3 లాభం రూ.1,102 కోట్లతో పోలిస్తే ఇది 15 శాతం ఎక్కువ. ఆపరేషన్ల నుంచి వచ్చిన రెవెన్యూ మూడు శాతం పెరిగి రూ.7,640 కోట్లుగా రికార్డయింది. ఆపరేటింగ్ మార్జిన్ సీక్వెన్షియల్గా 150 బేసిస్ పాయింట్లు పెరిగింది. క్యూ2లో ఇది 16.9 శాతం కాగా, తాజా క్యూ 3లో 18.4 శాతానికి చేరింది. మెటీరియల్ ఖర్చులు తగ్గడం, ధరలు, ఫారెక్స్ లాభాలు పెరగడం ఇందుకు కారణం. నగదు మిగులు నిల్వల విలువ రూ.17,407 కోట్లుగా తేలింది. క్యూ 2లో వీటి విలువ రూ.15,986 కోట్లు . ఈ క్వార్టర్లో మొత్తం 1,202,486 యూనిట్లను అమ్మగా, 562,772 యూనిట్లను ఎగుమతి చేసింది. ఫలితాల ప్రకటన నేపథ్యంలో బజాజ్ ఆటో షేర్లు 1.8 శాతం లాభపడి రూ.3,145 వద్ద ముగిశాయి.
ఇక ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవికి రాహుల్ రాజీనామా
కంపెనీ ప్రస్తుత చైర్మన్ రాహుల్ బజాజ్ ఈ పదవి నుం చి తప్పుకొని నాన్ –ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా కొనసాగుతారని బజాజ్ ఆటో తెలిపింది. 1970 నుంచి ఆయన డైరెక్టర్గా పనిచేస్తున్నారు. చివరిసారిగా బోర్డును 2015 ఏప్రిల్లో నియమించారు. ఈ ఏడాది మార్చితో రాహుల్ పదవీకాలం ముగుస్తుంది. రాహుల్ను నాన్ –ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా కొనసాగించడానికి బజాజ్ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటిన ఆయన కొత్త పదవిని స్వీకరిస్తారు.
మరికొన్ని ముఖ్యాంశాలు
డొమెస్టిక్ మార్కెట్లో బైకుల అమ్మకాలు 14 శాతం తగ్గాయి. కమర్షియల్ వెహికిల్స్ సెగ్మెంట్లో ఈ కంపెనీ 96 వేల యూనిట్లు అమ్మి 57 శాతం మార్కెట్ వాటా దక్కించుకుంది. ‘రీ’ బ్రాండ్ మార్కెట్ లీడర్గా నిలిచింది. ఏకంగా 89 శాతం మార్కెట్ వాటా సాధించింది. రీ పేరుతో బజాజ్ చిన్న ఆటోరిక్షాలను అమ్ముతున్న సంగతి తెలిసిందే. 100 నుం చి 110 సీసీ విభాగంలో 2.99 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. సీటీ సిరీస్, ప్లాటినా అమ్మకాలు పెరిగాయి. ఇంటర్నేషనల్ బిజినెస్ రికార్డు సృష్టించింది. ఒకే క్వార్టర్లో 562,772 యూనిట్లు అమ్మింది. వార్షికంగా ఎగుమతులు ఏడు శాతం పెరిగాయి. కంపెనీ నికర అమ్మకాల్లో
వీటి వాటా 43 శాతానికి చేరింది. మోటార్ సైకిల్ అమ్మకాలు (ఇంటర్నేషనల్ సేల్స్) 11 శాతం పెరిగి 4.84 లక్షల యూనిట్లకు చేరాయి. కంపెనీ చరిత్రలోనే ఇన్ని యూనిట్లు అమ్మడం రికార్డు. నైజీరియా, కాంగో, ఉగాండా, ఇథియోపియా దేశాల్లో అమ్మకాలు 15 శాతం పెరిగాయి. బంగ్లాదేశ్లో అమ్మకాలు తగ్గినా, శ్రీలంక, ఈజిప్టులో పెరిగాయి.