- రికార్డు స్థాయిలో బీర్ల సేల్స్
- 18 రోజుల్లో 35 లక్షల కాటన్ల బీర్లు ఖాళీ
- ఎండలు ముదురుతున్నా కొద్ది పెరుగుతున్న అమ్మకాలు
నల్గొండ, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో బీర్లు అమ్ముడవుతున్నాయి. ఎండలు ముదురుతున్నా కొద్ది బీర్ల సేల్స్ కూడా పెరుగుతున్నాయి. ఈ నెలలో పెండ్లీలతోపాటు ఇతర ఫంక్షన్లు కూడా ఉండడం బీర్ల అమ్మకాలకు కలిసొచ్చింది. రాష్ట్రంలో 2,650 వైన్స్ షాపులుండగా, వీటి పరిధిలో 19 లిక్కర్ డిపోలు నడుస్తున్నాయి. ఈ నెల 1 నుంచి 18 తేదీ వరకు జరిగిన మద్యం అమ్మకాల్లో మెజార్టీ పర్సంటేజీ బీర్లదే. సమ్మర్ కావడం వల్ల లిక్క ర్ సేల్స్ అంతగా పెరగలేదు. ఇటీవల సర్కారు లిక్కర్ రేట్లను తగ్గించింది. అయినా కస్టమర్లు బీర్ల వైపే మొగ్గుచూపారు. లైట్, స్ట్రాంగ్ బీర్లు రికార్డు స్థాయిలో సేల్
అవుతున్నాయి.
4.23 కోట్ల బీరు సీసాలు ఖాళీ
ఈ నెల 1 నుంచి 18 తేదీ వరకు 35,25,247 కాటన్లు బీర్లు అమ్ముడయ్యాయి. అంటే సగటున రోజుకు 1,95,847 కాటన్ల బీర్లు తాగేశారు. ఒక్కో కాటన్కు 12 బీర్ల చొప్పున లెక్కిస్తే సగటున రోజుకు 23,50,164 బీరు సీసాలు ఖాళీ అయ్యాయి. ఈ లెక్కన 18 రోజుల్లోనే 4,23,02,964 బీరు సీసాలను కస్టమర్లు ఖాళీ చేశారు. బీర్ల సేల్స్ ద్వారా సర్కార్కు వచ్చిన ఆదాయం రూ.582.99 కోట్లు. బీర్లతో పోలిస్తే లిక్కర్ సేల్స్ టార్గెట్ను అధికారులు చేరుకోలేకపోయారు. 18 రోజుల్లో 13,26,347 లిక్కర్ కాటన్లు మాత్రమే సేల్ అయ్యాయి. ఈసేల్స్ ద్వారా సర్కార్కు రూ.904.47 కోట్ల ఇన్కమ్ వచ్చింది.
టాప్లో నల్గొండ, కరీంనగర్
బీర్ల అమ్మకాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా మొదటి స్థానంలో నిలువగా కరీంనగర్ జిల్లా రెండో ప్లేస్లో నిలిచింది. నల్గొండ జిల్లాలో 3,00,364 కాటన్ల బీర్లు అమ్ముడవగా, రూ.48.14 కోట్ల ఆదాయం వచ్చింది. లిక్కర్ సేల్స్లో రంగారెడ్డి జిల్లాది మొదటి స్థానం. ఈ జిల్లాలో 1,20,334 కాటన్ల లిక్కర్ సేల్కాగా, రూ.78.42 కోట్ల ఆదాయం వచ్చింది. లిక్కర్ అమ్మకాల్లో నల్గొండ జిల్లా రెండో స్థానంలో ఉంది. ఎండలు ముదురుతున్నా కొద్ది బీర్లకు ఇంకా డిమాండ్ పెరిగే అవకాశముందని అధికారులు చెపుతున్నారు.