V6 News

పేరు పైన రాలేదని.. చెప్పులతో కొట్టుకున్న ఎంపీ, ఎమ్మెల్యే

పేరు పైన రాలేదని.. చెప్పులతో కొట్టుకున్న ఎంపీ, ఎమ్మెల్యే

సంత్‌ కబీర్ నగర్: శంకుస్థాపన కార్యక్రమంలో రాజకీయ నాయకులు కొట్టుకున్నారు. అదీ కూడా ఒకే పార్టీకి చెందిన నాయకులు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరగగా ఇందుకు సంబంధించిన వీడయో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.  బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే తన్నుకున్నారు. శిలా ఫలకంపై పేర్ల వరుస క్రమం గురించి బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ సింగ్, ఎంపీ శరద్ త్రిపాఠి వాగ్వాదానికి దిగారు. తర్వాత కోపంతో  ఊగిపోతూ చెప్పులతో కొట్టుకున్నారు. సంత్ కబీర్ నగర్ జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో ఈ ఘటన జరిగింది. ఇద్దరికీ సర్ది చెప్పేందుకు అక్కడే ఉన్న నేతలు, ఇతర అధికారులు ప్రయత్నించారు.

అయితే వారు వినిపించుకోలేదు. పరస్పరం పిడిగుద్దులు కురిపించుకున్నారు. పోలీస్ అధికారులు వచ్చి ఇద్దరు నేతలనూ శాంతింప చేశారు. ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే మద్దతుదారులు ఆందోళనలకు దిగారు.  ఘటనపై బీజేపీ యూపీ విభాగం సీరయస్ అయ్యింది. ఇద్దరు నేతలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.