ఇవాళ సమావేశం కానున్న బీజేపీ స్టీరింగ్ కమిటీ

ఇవాళ సమావేశం కానున్న బీజేపీ స్టీరింగ్ కమిటీ

కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి అధ్యక్షతన మీటింగ్

హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ స్టీరింగ్ కమిటీ సమావేశం మంగళవారం చౌటుప్పల్ లో జరుగనుంది. కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి అధ్యక్షతన ఉదయం11 గంటలకు జరుగనున్న ఈ భేటీకి  నియోజకవర్గ పరిధిలోని 6 మండలాలు, 2 మున్సిపాలిటీల పార్టీ ఇంచార్జీలు, సహ ఇంచార్జీలు హాజరుకానున్నారు. ఇందులో ప్రధానంగా ప్రచార వ్యూహం, గెలుపు కోసం అనుసరించాల్సిన పద్ధతులపై చర్చించనున్నారు. మీటింగ్​కు మునుగోడు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, పార్టీ నేతలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, రవీందర్ నాయక్ తదితరులు  హాజరుకానున్నారు.

ఈ మీటింగ్ తర్వాత ఎవరికి కేటాయించిన మండలాలకు వారు వెళ్లి పార్టీ పరిస్థితిపై స్థానిక నాయకులతో సమావేశమవుతారు. బూత్ స్థాయిలో పార్టీ కమిటీల ఏర్పాటు, పార్టీ బలోపేతంపై చర్చిస్తారు. ఎక్కడైనా బూత్ కమిటీలు వేయకుంటే వెంటనే వాటిని భర్తీ చేస్తారు. దసరాలోపు పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి పెట్టనున్న మండల ఇంచార్జీలు, సహ ఇంచార్జీలు.. దసరా తర్వాత ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తారు.