హైదరాబాద్, వెలుగు: జనాల్లో ఉన్న కరోనా భయాన్ని ఓ మెడికల్ గ్యాంగ్ సొమ్ము చేసుకుంటోంది. కరోనా మందులను, టెస్టింగ్ కిట్లను బ్లాక్మార్కెట్చేస్తూ లక్షల్లో కమీషన్లు దండుకుంటోంది. కస్టమర్ల పేరుతో డెకాయ్ ఆపరేషన్ చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు ఆ గ్యాంగ్ ఆటకట్టించారు. ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. రెమ్డెసివిర్, ఫావిపిరావిర్ సహా రూ.35.5 లక్షల విలువ చేసే యాంటీ వైరల్ మందులు, 55 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను సీపీ అంజనీకుమార్ మంగళవారం వెల్లడించారు.
వాట్సాప్లో ‘షార్టేజ్’ దందా
సికింద్రాబాద్కు చెందిన కె. వెంకట సుబ్రహ్మణ్యం (36) మల్కాజిగిరి ఆనంద్బాగ్లో ‘శ్రీ మెడిక్యూర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరిట మెడికల్ ఏజెన్సీ నడుపుతున్నాడు. హెటిరో తయారు చేసిన కరోనా మందు రెమ్డెసివిర్కు డిస్ట్రిట్యూటర్గా ఉన్నాడు. దాంతో పాటు ఫాబిఫ్లూ (ఫావిపిరావిర్)నూ సప్లై చేస్తున్నాడు. కరోనా భయాన్నే అలుసుగా తీసుకున్న సుబ్రహ్మణ్యం ఎమర్జెన్సీలో వాడే ఆ కరోనా మందులతో పాటు ఆక్టెమ్రా (టొసిలిజుమాబ్) ఇంజెక్షన్లు, కరోనా టెస్టింగ్ కిట్లనూ బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవాలని ప్లాన్ వేశాడు. ఆ మందులను షార్టేజ్ లిస్టులో పెట్టి బ్లాక్మార్కెట్లోకి పంపాడు. అందుకోసం వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేసి వాటి రేట్, డిమాండ్ను షేర్ చేసేవాడు. బ్లాక్మార్కెట్ దందా అంతా ఆ గ్రూప్ నుంచే చేసేవాడు.
చెయిన్ సిస్టమ్
బ్లాక్మార్కెట్ దందా కోసం ఓ పెద్ద చెయిన్ సిస్టమ్నే ఏర్పాటు చేశాడు వెంకట సుబ్రహ్మణ్యం. ఢిల్లీకి చెందిన గగన్ అగర్వాల్ అనే వ్యక్తితో కలిసి మందులు, టెస్ట్ కిట్లను బ్లాక్ చేశాడు. హాస్పిటళ్లు, మెడికల్ షాపులకు వెళ్లాల్సిన మందులను హైదరాబాద్ నారాయణగూడకు చెందిన రాహుల్ అగర్వాల్ (29) అనే వ్యక్తికి పంపించేవాడు. సిటీ ఆస్పత్రుల్లోని ఫార్మసీల్లో షార్టేజ్ మందుల వివరాలను మెడికల్ రిప్రజెంటేటివ్స్ ద్వారా తెలుసుకునేవాడు. తర్వాత ఆ కరోనా మందులను ఫీల్ఖానాకు చెందిన మెడికల్ ఏజెంట్ మహ్మద్ షఖీర్ (34), ముషీరాబాద్కు చెందిన కె. కిశోర్ (29), సంతోష్ కుమార్ (39), తలాబ్కట్టకు చెందిన సైఫ్ అలీ మహ్మద్ (22), సైదాబాద్కు చెందిన ఫిర్దోస్ మహ్మద్ (26) గ్యాంగ్తో కలిసి బ్లాక్మార్కెట్లో అమ్మేవాడు.
డిమాండ్ను బట్టి మందుకు లక్ష
సంతోష్, కిశోర్, మహ్మద్ షఖీర్ల నుంచి రాహుల్, ఫిర్దోస్లు రూ. 8 వేల చొప్పున కమీషన్కు కరోనా మందులను కొనేవారు. డిమాండ్ను బట్టి రూ.15 వేల నుంచి రూ.18 వేల కమీషన్తో మందులను కస్టమర్లకు అమ్మేవాళ్లు. రూ.5,400 విలువ చేసే రెమ్డెసివిర్ను రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు రేటు పెంచి సొమ్ము చేసుకున్నారు. రూ.40 వేలు విలువ చేసే ఆక్టెమ్రా ఇంజెక్షన్ను రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకూ అమ్మేటోళ్లు. ఇటు ఫాబిఫ్లూ, కరోనా టెస్టింగ్ కిట్లకూ రూ.వేలల్లో ధరలు పెంచి బ్లాక్మార్కెట్ దందా చేశారు. ఈ దందాపై సమాచారం అందుకున్న హైదరాబాద్ సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు కస్టమర్ల పేరిట డెకాయ్ ఆపరేషన్ చేశారు. అన్ని విషయాలూ రాబట్టి మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు.