ముగ్గురు మహారాష్ట్రవాసుల అరెస్ట్
2న చందానగర్లో రూ.80 లక్షల విలువైన సిగరెట్ల దొంగతనం
చందానగర్(హైదరాబాద్), వెలుగు: సిగరెట్ కార్టన్ల దొంగలు దొరికారు. హైదరాబాద్లోని చందానగర్లో ఉన్న శ్రీవిష్ణు ప్రాంచైజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గోడౌన్లో రూ.80 లక్షల విలువైన సిగరెట్ కార్టన్లు కొద్ది రోజుల క్రితం చోరీకి గురైన సంగతి తెలిసిందే. ఆ కేసులో ముగ్గురిని చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను శనివారం డీసీపీ వెంకటేశ్వరరావు వెల్లడించారు. మహరాష్ర్ట నాందేడ్ జిల్లా వఘాల గ్రామానికి చెందిన సంజయ్ పుండలిక్ (38), అదే జిల్లా దత్తమందిర్కు చెందిన నాందేవ్ సాంబాజీ ముండే (53), న్యూఎన్ఐఆర్ ప్రాంతానికి చెందిన రాథోడ్ రాజేబు బాబు (41)లను అదుపులోకి తీసుకున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో చోరీకి స్కెచ్
సంజయ్ బట్టల షాపును నడుపుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడడంతో తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించేందుకు దొంగతనం స్కెచ్ వేశాడు. ఇందుకు డ్రైవర్గా పనిచేసే నాందేవ్, టీస్టాల్ నడుపుకునే రాథోడ్, కాశీనాథ్, రాజు ఎన్వాడే, దిగంబర్ దుమలేలతో కలిసి గ్రూప్గా ఏర్పడ్డాడు. పోయినేడాది డిసెంబర్ 25న దిగంబర్ మినహా మిగతా వాళ్లతో సంజయ్ చోరీకి స్కెచ్ వేశాడు. అందరూ కలిసి హైదరాబాద్లోని సిగరెట్ కంపెనీలో చోరీ చేయాలని డిసైడ్ అయ్యారు. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కు వచ్చి రెక్కీ చేశారు. చందానగర్లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ బిల్డింగ్ వద్ద డీసీఎం నుంచి సిగరెట్ కార్టన్లను దింపి నాలుగో అంతస్తులోకి తీసుకుపోతుండడాన్ని గుర్తించారు. జనవరి 2న శ్రీవిష్ణు ప్రాంచైజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అర్ధరాత్రి, గోడౌన్ గ్రిల్స్ తీసేసి, సీసీటీవీ కెమెరాల కనెక్షన్ను కట్ చేశారు. గోడౌన్లోని 59 సిగరెట్ కార్టన్లను చోరీ చేసి మినీ ట్రక్కులో పరారయ్యారు. ప్రాంచైజీ యజమాని ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. సిగరెట్ కార్టన్లతో పాటు మినీ ట్రక్కు, కారు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో నాందేవ్ పాత నేరస్థుడని పోలీసులు చెబుతున్నారు. కాశీనాథ్, రాజు, దిగంబర్ పరారీలో ఉన్నారు.