- చేరువగా జాబిలి కక్ష్యలోకి చంద్రయాన్2
- కక్ష్య మార్పు సక్సెస్ఫుల్
- వచ్చే నెల 7న విక్రమ్ ల్యాండింగ్
- అసలు టెన్షన్ ఇప్పుడే మొదలైందన్న ఇస్రో చైర్మన్ శివన్
- మరో ముఖ్యమైన అడుగుపడిందని ప్రధాని ప్రశంస
చంద్రయాన్ 2 ప్రయాణం సాఫీగా సాగిపోతోంది. ఎలాంటి అడ్డంకులూ లేకుండా నాన్స్టాప్గా జర్నీ చేస్తోంది. ఆ జర్నీలో భాగంగా కొద్ది రోజుల క్రితమే భూ కక్ష్యకు బైబై చెప్పిన చంద్రయాన్2, తాజాగా చంద్రుడి కక్ష్యకు హాయ్ చెప్పింది. మంగళవారం చంద్రయాన్2 స్పేస్క్రాఫ్ట్ను విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి పంపింది ఇస్రో. దానికి అనుగుణంగా బుధవారం మరో సారి దాని కక్ష్యను మరోసారి మార్చనున్నారు. సెప్టెంబర్ 3 వరకు నాలుగు సార్లు కక్ష్య మార్పులు చేసి, సెప్టెంబర్ 7న ల్యాండర్ విక్రమ్ను చందమామపై దింపుతారు. కక్ష్య మార్పు సక్సెస్ అవడంతో ఇస్రో సైంటిస్టులను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. |
చంద్రయాన్ 2 ప్రయాణం నాన్స్టాప్గా సాగుతోంది. ఏ అడ్డంకి లేకుండా సాఫీగా వడివడిగా చందమామవైపు పరుగులు పెడుతోంది. జాబిలికి నీడలా చందమామ కక్ష్యలోకి చేరిపోయింది. సోమవారం చంద్రయాన్ 2ను విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి పంపించింది ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ). ఉదయం 9.02 గంటల నుంచి 1738 సెకన్ల పాటు చంద్రయాన్2 ఇంజన్లను మండించి ‘చంద్ర కక్ష్య’ మార్పును చేసింది. చంద్రుడికి 18,072 కిలోమీటర్ల దూరంలో (అపోజీ), 114 కిలోమీటర్ల ఎత్తున చంద్రయాన్2ను వదిలిపెట్టింది. తర్వాతి మార్పుల్లో భాగంగా చంద్రుడికి అతి దగ్గరగా చంద్రయాన్2ను పంపనున్నారు ఇస్రో సైంటిస్టులు. 30 కిలోమీటర్ల అపోజీతో 100 కిలోమీటర్ల ఎత్తుకు దానిని పంపుతారు. ఆ తర్వాత ల్యాండర్ విక్రమ్ను దాని నుంచి వేరు చేసి చంద్రుడి దక్షిణ ధ్రువంపై దింపేందుకు ప్రయత్నిస్తారు. సెప్టెంబర్ 7న చందమామపై విక్రమ్ దిగుతుంది. బెంగళూరుకు సమీపంలోని బైలాలు వద్ద ఉన్న ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ (ఐడీఎస్ఎన్) సహకారంతో బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్లో ఉన్న మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్ నుంచి చంద్రయాన్ 2 కక్ష్యను మార్చారు. ఎప్పటికప్పుడు దానిని అక్కడి నుంచే పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అది ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగుతోంది. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30 గంటల వరకు మరోసారి చంద్రయాన్2 కక్ష్యను మారుస్తారు. దాన్ని కలుపుకుని సెప్టెంబర్ 7 లోపు నాలుగు సార్లు చంద్రయాన్ 2 కక్ష్యను మారుస్తారు. చాలా వాయిదాల తర్వాత జులై 22న చంద్రయాన్2 ప్రయోగాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే.
గుండె ఆగినంత పనైంది
చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్2ను పంపేటప్పుడు తమ గుండె ఆగినంత పనైందని ఇస్రో చైర్మన్ కే శివన్ అన్నారు. చంద్రయాన్2 కక్ష్య మార్పు తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. స్పేస్క్రాఫ్ట్ ఇంజన్లను మండించి జాబిల్లి లైన్లోకి నెట్టేటప్పుడు తమ గుండె వేగం బాగా పెరిగిందన్నారు. దాదాపు అరగంట పాటు మనసులో ఏదో ఒక అలజడి రేగుతూనే ఉందన్నారు. ఇప్పటిదాకా అంతా సాఫీగానే సాగినా సెప్టెంబర్ 7వ తేదీని తలచుకుంటే కొంత భయంగా ఉందని, విక్రమ్ దిగే ఆ చివరి 15 నిమిషాలే టెర్రర్ టైం అని అన్నారు. ఇప్పుడు ఇస్రో సైంటిస్టులందిరలో టెన్షన్ మరింత పెరిగిందే గానీ తగ్గలేదన్నారు. అయితే, ఎన్ని టెన్షన్లున్నా, భయాలున్నా కచ్చితంగా విక్రమ్ను చందమామపై దింపే తీరుతామన్నారు. అందుకోసం ఇప్పటిదాకా చేయాల్సిన అన్ని టెస్టులు, సిమ్యులేషన్లు (చంద్రుడి వాతావరణాన్ని సృష్టించి ల్యాండింగ్ చేయడాన్ని అనుకరించడం) చేశామని, సబ్సిస్టమ్లు, సిస్టమ్లు, సెన్సర్ల పనితీరును పరిశీలించామని శివన్ తెలిపారు. ప్రయోగం సక్సెస్ అవడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ఆనందం వ్యక్తం చేశారు. ‘‘చంద్రయాన్2ను చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన ఇస్రో టీంకు శుభాకాంక్షలు. చంద్రుడి దగ్గరకు వెళ్లే క్రమంలో మరో ముఖ్యమైన అడుగు ఇది” అని ఆయన ట్వీట్ చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర కూడా ఇస్రోను పొగుడుతూ ట్వీట్ చేశారు. ‘‘ఈ ప్రయాణమే ఓ గమ్యం. మమ్మల్ని భాగం చేసిన ఈ ప్రయాణాన్ని చాలా ప్రేమిస్తున్నాం. ఇక్కడితో మీ ప్రయాణం ఆపొద్దు. తర్వాతి స్టాప్ అంగారకుడే” అని ట్వీట్ చేశారు.
ఆ పదిహేను నిమిషాలు..
- ఒకటి: చంద్రుడిపై దిగడానికి నాలుగు రోజుల ముందు ఆర్బిటర్ నుంచి విక్రమ్ విడిపోతుంది. చంద్రుడికి 30 కిలోమీటర్ల ఎత్తులో 100 కిలోమీటర్ల దూరంలో గంటకు 6,120 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది.
- రెండు: సెప్టెంబర్ 7న ల్యాండ్ అవుతున్న టైంలో 10 నిమిషాల 30 సెకన్ల తర్వాత చంద్రుడికి 7.4 కిలోమీటర్ల ఎత్తుకు చేరుతుంది. అప్పుడు దాని వేగం 526 కిలోమీటర్లకు తగ్గుతుంది.
- మూడు: ఆ తర్వాత 38 సెకన్లలో దాని వేగం 331.2 కిలోమీటర్లకు పడిపోతుంది. చంద్రుడికి జస్ట్ 5 కిలోమీటర్ల ఎత్తుకు చేరుతుంది.
- నాలుగు: తర్వాత 89 క్షణాల్లో చంద్రుడికి అతి దగ్గరగా వెళుతుంది. కేవలం 400 మీటర్ల ఎత్తులోనే ఉంటుంది.
- ఐదు: ఆ ఎత్తులో 12 సెకన్ల పాటు స్థిరంగా ఉండి చంద్రుడి మీద పరిస్థితులను సేకరిస్తుంది.
- ఆరు: తర్వాతి 66 క్షణాల్లో 100 మీటర్ల ఎత్తుకు ల్యాండర్ చేరుతుంది. 25 సెకన్ల పాటు అక్కడే స్థిరంగా ఉండి, ఎక్కడ దిగాలో విక్రమ్ డిసైడ్ అవుతుంది. దిగాలా, వేరే చోటుకు వెళ్లాలా అని నిర్ణయించుకుంటుంది.
- ఏడు: 10 మీటర్ల ఎత్తుకు చేరిన తర్వాత చందమామపై దిగడానికి 13 సెకన్ల టైం తీసుకుంటుంది విక్రమ్. ఆ టైంలో 5 ఇంజన్లు ఒకేసారి మండుతాయి.
- ఎనిమిది: విక్రమ్ ల్యాండ్ అవగానే ఇంజన్లు బందయ్యేలా సెన్సర్లు మెసేజ్ పంపుతాయి.
- తొమ్మిది: ల్యాండ్ అయిన 15 నిమిషాల తర్వాత చంద్రుడిపై తీసిన ఫస్ట్ ఫొటోలను భూమికి పంపుతుంది విక్రమ్.
- పది: ల్యాండ్ అయిన నాలుగు గంటల తర్వాత రోవర్ ప్రజ్ఞాన్ బయటకొస్తుంది. చందమామపై కలియతిరుగుతూ డేటాను సేకరిస్తుంది.
దక్షిణ ధ్రువమే ఎందుకు?
ప్రస్తుతం చంద్రుడిపై ప్రయోగాలు చేస్తున్న చాలా దేశాలు దక్షిణ ధ్రువంవైపే చూస్తున్నాయి. ఎందుకు? దానికి ఇస్రో సమాధానం చెప్పింది.
- ఒకటి: కొన్ని వందల కోట్ల ఏళ్లుగా దక్షిణ ధ్రువంపై ఉన్న లోయల్లో సూర్యుడి వెలుతురన్నదే పడలేదు. కాబట్టి సౌర వ్యవస్థ పుట్టుకలోని విషయాలు చెక్కు చెదరకుండా ఉంటాయి.
- రెండు: అంతా చీకట్లోనే ఉండే ఆ ప్రాంతంలో దగ్గరదగ్గర 10 కోట్ల టన్నుల నీళ్లుండే అవకాశం ఉంది.
- మూడు: చందమామ నేలలో హైడ్రోజన్, అమ్మోనియా, మీథేన్, సోడియం, పాదరసం, వెండి ఆనవాళ్లున్నాయి. కాబట్టి కావాల్సిన వనరులు పుష్కలంగా ఉంటాయి.
- నాలుగు: అక్కడ దొరికే మూలకాలు, అనువైన స్థలం కావడంతో భవిష్యత్ ప్రయోగాలకు అదే మంచి వేదిక అవుతుంది.