ట్రాప్లో చిక్కిన కాంట్రాక్టర్ను పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్, వెలుగు: దేశ రక్షణ రంగ వ్యవస్థను ఐసిస్ టార్గెట్ చేస్తోంది. హనీ ట్రాప్తో డిఫెన్స్ సైంటిస్టుల నుంచి రహస్యాలను లాక్కోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్సీఐ)–- డీఆర్డీవో ల్యాబొరేటరీ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ని ట్రాప్ చేసింది. ఈ విషయాన్ని ఎల్బీనగర్ ఎస్వోటీ, బాలాపూర్ పోలీసులు ట్రేస్ చేశారు. కాంట్రాక్ట్ ఇంజనీర్ను శుక్రవారం అరెస్ట్ చేశారు. 2 మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ శుక్రవారం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా పెందుర్తి పాపయ్యరాజు పాలెంకు చెందిన దుక్క మల్లికార్జున రెడ్డి అలియాస్ అర్జున్ బిట్టు(29) ఫ్లాష్ ఫోర్జ్ కంపెనీలో క్వాలిటీ చెక్ ఇంజనీర్గా పనిచేశాడని చెప్పారు. డీఆర్డీవో ల్యాబొరేటరీకి చెందిన ప్రాజెక్టులను నిర్వహించే పఠాన్చెరులోని క్వెస్ట్ కంపెనీలో 2018లో జాయిన్ అయ్యాడని, ప్రాజెక్ట్లపై అనుభవం రావడంతో డీఆర్డీవో కు చెందిన అడ్వాన్స్ నావెల్ సిస్టమ్ ప్రోగ్రామ్లో క్వాలిటీ ఇంజనీర్గా కాంట్రాక్ట్ తీసుకున్నాడని వివరించారు.
ఇలా ట్రాప్ చేశారు
నటాషా రావు పేరుతో ఫేస్బుక్లో వచ్చిన రిక్వెస్ట్ను మల్లికార్జున యాక్సెప్ట్ చేశాడు. వాళ్లు యూకే డిఫెన్స్ జనరల్లో పబ్లిషింగ్ వర్క్స్ చేస్తున్నట్లు నమ్మించారు. మల్లికార్జున్ చేస్తున్న వర్క్తో పాటు పనిచేస్తున్న ప్రాంతం, కంపెనీ వివరాలు సేకరించారు. డీఆర్డీఎల్,ఆర్సీఐకి సంబంధించిన సీక్రెట్లు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే మల్లికార్జున తన బ్యాంక్ అకౌంట్ల వివరాలు వాళ్లకు ఇచ్చాడు. ఇంటెలిజెన్స్ సమాచారంతో ఎస్వోటీ పోలీసులు అలర్ట్ అయ్యారు. మీర్పేట్ త్రివేణి నగర్లోని నివాసం ఉంటున్న మల్లికార్జునను అరెస్ట్ చేశారు. ఇది ఐసిస్ హనీ ట్రాప్గా గుర్తించారు.