కచ్ అజ్రాఖ్​కు జీఐ సర్టిఫికెట్

కచ్ అజ్రాఖ్​కు జీఐ సర్టిఫికెట్

ఇటీవల కంట్రోలర్​ జనరల్​ ఆఫ్​ పేటెంట్స్​, డిజైన్స్​ ట్రేడ్​ మార్క్​(సీజీపీడీటీఎం), గుజరాత్​లోని కచ్​కు చెందిన కచ్ అఖ్రాజ్​ సంప్రదాయ వస్త్ర కళా రూపానికి భౌగోళిక సూచిక సర్టిఫికేట్​ను జారీ చేసింది. కచ్​ అజ్రఖ్​ 2500 సంవత్సరాల నాటిది. ప్రస్తుతం సింధ, బార్మర్​, కచ్​ ప్రాంతాల్లో ఆచరిస్తారు. ఇది 100 శాతం పర్యావరణహితమైన, విషరహితమైంది. 

అజ్రఖ్​ కళలో ఒంటె పేడ, న్యాచురల్​ కాస్టిక్​ సోడా, ఆముదం నూనె, నీళ్లతో చేసిన మిశ్రమంతో ముడి వస్త్రం(కాటన్​, ఉన్ని, పట్టు)పై ఉండే మలినాలను తొలగించి శుద్ధి చేసిన తర్వాత కాటన్, ఉన్ని, పట్టు వస్త్రాలపై చారిత్రక సంఘటనలను చిత్రాల రూపంలో క్లిష్టమైన డిజైన్లతో చాలా శ్రద్ధగా హ్యాండ్​ బ్లాక్​ ప్రింటింగ్​ ప్రక్రియతో ముద్రిస్తారు. 

  •     ప్రత్యేకంగా అజ్రాఖ్​ కళలో వస్త్రానికి రెండు వైపులా డిజైన్లను ముద్రిస్తారు. అజ్రాఖ్​ కళ ప్రధానంగా కచ్​లోని అజ్రాఖ్​పూర్​, ధమడ్కా, ఖావ్డాలోని గ్రామాల్లో అభివృద్ధి చెందింది. ఈ కళను 400 సంవత్సరాల క్రితం సింధ్​ ముస్లింలు ఈ ప్రాంతానికి పరిచయం చేశారు. 
  •     అజ్రాఖ్​ అంటే అరబిక్​ భాషలో నీలిమందు అని అర్థం. నీలం రంగును పొందడానికి రంగుగా ఉపయోగించే ఒక పదార్థం. 
  •     అజ్రఖ్​ కళలో చిత్రాలను ముద్రించడానికి సాంప్రదాయకంగా నీలం(ఆకాశానికి సూచిక), ఎరుపు (భూమి, అగ్నికి సూచిక), తెలుపు (నక్షత్రాలకు సూచిక) తదితర మూడు రంగులను ఉపయోగిస్తారు. 
  •     రబారీలు, మాల్దారీలు, అహిర్లు వంటి సంచార పశుపోషకులు, వ్యవసాయం చేసే ప్రజలు అజ్రాఖ్​ ముద్రించిన వస్త్రాన్ని తలపాగాలు, లుంగీలు లేదా స్టోల్స్​గా ధరిస్తారు. 

సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్​లో మహిళా కోటా

సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్​లో మహిళా కోటా అమలుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బార్​ అసోసియేషన్​ ఎగ్జిక్యూటివ్​ కమిటీ(ఎస్​సీబీఏ)లో మూడింట ఒక వంతు మహిళా రిజర్వేషన్​ అమలు చేయాలని ఆదేశించింది. ఇకపైన ఎస్​సీబీఏలో ముగ్గురు ఎగ్జిక్యూటివ్​ సభ్యులు, ఇద్దరు సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ సభ్యులు, కోశాధికారి అందరూ మహిళలే ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

మానవరహిత బాంబర్​ డ్రోన్​

రక్షణ శాఖ అవసరాలకు అనుగుణంగా పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో మానవ రహిత బాంబర్​ డ్రోన్​ను ఫ్లయింగ్​ వెడ్జ్​ సంస్థ తయారు చేసింది. ఈ మానవ రహిత డ్రోన్​కు ఎఫ్​డబ్ల్యూడీ – 200బీ అని పేరు పెట్టారు. ఈ మానవ రహిత బాంబర్ డ్రోన్​ 100 కిలోల పేలోడ్​ను మోసుకెళ్లగలదు. గంటకు 370 కి.మీ. వేగంతో 12 నుంచి 20 గంటలపాటు గగనతలంలో ప్రయాణించే సామర్థ్యం ఈ డ్రోన్​కు ఉంది. గ్రౌండ్​ కంట్రోల్​ స్టేషన్ నుంచి 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ బాంబర్​ డ్రోన్​ను త్వరలోనే రక్షణశాఖకు ఫ్లయింగ్​ వెడ్జ్​ సంస్థ అందించనుంది.