హైదరాబాద్, వెలుగు: యంగ్ క్రికెటర్లను ప్రోత్సహించేందుకు హైదరాబాద్లోని ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమీ (ఎంఎస్డీసీఏ) స్కూల్ ప్రీమియర్ లీగ్ పేరిట టోర్నీ ఏర్పాటు చేయడంపై ఇండియా అండర్19 విన్నింగ్ టీమ్ వైస్ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ షేక్ రషీద్ హర్షం వ్యక్తం చేశాడు. తాను స్కూల్ క్రికెట్ ఆడుతున్న సమయంలో ఇలాంటి ఫ్రాంచైజీ లీగ్లు లేవన్నాడు. దాంతో, ఎక్కడ టోర్నమెంట్లు జరుగుతున్నాయో తెలుసుకొని వెళ్లి ఆడేవాడినని తెలిపాడు.
ఈ టీ20 లీగ్ పోస్టర్ను శుక్రవారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (నాచారం)లోని ఎంఎస్డీసీఏ హైపెర్ఫామెన్స్ సెంటర్లో రషీద్ ఆవిష్కరించాడు. యంగ్ క్రికెటర్లను ప్రోత్సహించేందుకు అండర్-14 స్థాయిలో టీ20 లీగ్ నిర్వహించడం గొప్ప ప్రయత్నమన్నాడు. అనేక కష్టాలను ఎదుర్కొని, ఒక పేద కుటుంబం నుంచి పైకొచ్చిన రషీద్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పల్లవి విద్యాసంస్థల సీవోవో యశస్వి అన్నారు. హైదరాబాద్లోని ఎంఎస్డీసీఏ కేంద్రాల్లో ఈనెల 20వ తేదీన సెలెక్షన్స్ నిర్వహిస్తామని, ఆసక్తిగల క్రికెటర్లు 7396386214, 7618703508 నంబర్లకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్డీసీఏ తెలంగాణ పార్ట్నర్ బ్రైనాక్స్ బీ సంస్థ డైరెక్టెర్ రషీద్ బాషా, 7హెచ్ స్పోర్ట్స్ డైరెక్టెర్ బి.వెంకటేష్ పాల్గొన్నారు.