స్పీకర్ నిర్ణయాలపై సభ బయట మాట్లాడొద్దు
లోక్సభ మెంబర్లకు ఓం బిర్లా సూచన
న్యూఢిల్లీ: తన నిర్ణయాలపై సభ బయట మాట్లాడటం మంచి సంప్రదాయం కాదని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మంగళవారం అన్నారు. లోక్సభలో సప్లిమెంటరీ ప్రశ్నలు అడిగేందుకు తనకు అనుమతి ఇవ్వడంలేదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ ఆరోపించిన మరుసటి రోజే స్పీకర్ దీనిపై రియాక్ట్ అయ్యారు. చేపల్ని కోల్డ్ స్టోరేజ్లో ఉంచడంపై అడిగిన ప్రధాన ప్రశ్న కు సభ్యులు చాలా సప్లిమెంటరీ ప్రశ్నల్ని అడిగారు. మరో అంశాన్ని టేకప్ చేయడానికి స్పీకర్కు సుమారు 20 నిమిషాలు పట్టింది. కాంగ్రెస్ సహా మరికొన్ని పార్టీల ఎంపీలు మంగళవారం సభలో ఎక్కువ సప్లిమెంటరీ క్వశ్చన్లు అడిగారు. దీనిపై ఓంబిర్లా రియాక్ట్ అయ్యారు. “ ఒక ప్రశ్నకు 15-–20 నిమిషాలు పడుతుంది … ఆపై మధ్యాహ్నం 12 గంటల తర్వాత సప్లిమెంటరీ ప్రశ్నలు అనుమతించడం మంచిది కాదు ” అని బిర్లా సభ్యులకు వివరించారు. ఈ సందర్భంలో స్పీకర్ తీసుకునే నిర్ణయాలపై సభ బయట ప్రశ్నించడం మంచి పద్ధతి కాదని సూచించారు. క్వశ్చన్ అవర్లో సభ్యులు అడిగే ప్రశ్నలు, మంత్రులు చెప్పే సమాధానాలు బ్రీఫ్గా ఉండాలని స్పీకర్ తరచూ సభలో చెబుతూనే ఉన్నారు.
కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ ఎంపీల వాకౌట్
క్వశ్చన్ అవర్లో సప్లిమెంటరీ ప్రశ్నల్ని అడిగేందుకు స్పీకర్ నిరాకరించారంటూ మంగళవారం కాంగ్రెస్ , డీఎంకె, ఎన్సీపీ ఎంపీలు లోక్సభ నుంచి మంగళవారం వాకౌట్ చేశారు. అధికార భాషకు సంబంధించిన ప్రశ్నపై హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ సమాధానం చెబుతుండగా కొంతమంది సభ్యులు నిరసనలు తెలిపారు. వాటినిపట్టించుకోకుండా స్పీకర్ ఓం బిర్లా తర్వాత ప్రశ్నను టేకప్చేశారు. సప్లిమెంటరీ క్వశ్చన్లు అడిగేందుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ డీఎంకే లీడర్ టీఆర్ బాలు నిరసన తెలిపారు. కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ఆయనకు మద్దతు తెలిపారు. స్పీకర్ మరొక ప్రశ్నకు అవకాశం ఇవ్వడంతో కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ సభ్యులు వాకౌట్చేశారు.