పూణే: కరోనా సోకిన వృద్ధుడ్ని ఆస్పత్రికి చేర్చే క్రమంలో ఒక డాక్టర్ డ్రైవర్గా మారాల్సి వచ్చింది. సదరు ఘటన మహారాష్ట్రలోని పూణేలో జరిగింది. కరోనా సెంటర్లో ఉన్న సదరు 71 ఏళ్ల వృద్ధుడి ఆక్సీజన్ లెవల్స్ పడిపోవడంతో ఆయనను వేరే ఆస్పత్రికి చేర్చారు. ఈ క్రమంలో అంబులెన్స్ డ్రైవర్ హెల్త్ సడెన్గా క్షీణించడంతో తాను వెహికిల్ నడిపాల్సి వచ్చిందని సదరు డాక్టర్ రంజీత్ నికమ్ చెప్పారు.
‘ఈ ఘటన అర్ధరాత్రి 2 గంటలకు జరిగింది. నేను కరోనా కేర్ సెంటర్లోనే ఉన్నా. ఒక పెద్దాయన ఆక్సీజన్ లెవల్ పడిపోయిందని నాకు కాల్ వచ్చింది. వెంటనే సీనియర్ డాక్డర్స్ సలహాలు తీసుకున్నా. సదరు పెద్దాయనను పెద్దాసుపత్రికి మార్చాలని నిర్ణయించాం.సెంటర్లో ఉన్న వ్యాన్ డ్రైవర్ అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో 108ని పిలవడానికి యత్నించాం. కానీ కాల్ కలవలేదు. దీంతో నేనే బండి నడిపా. పెద్దాయనను ఆస్పత్రిలో చేర్పించాం. ఆయన ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం ఇప్పుడు నిలకడగా ఉంది’ అని రంజీత్ పేర్కొన్నారు.