- డ్రంకెన్ డ్రైవ్.. ఓవర్ స్పీడ్ ప్రాణాలు తీస్తున్నయ్
- గ్రేటర్లో డైలీ 33 రోడ్డు ప్రమాదాలు
- ఈ ఏడాది ఆరు నెలల్లో 6 వేల యాక్సిడెంట్లు..826 మృతి
‘ఈ నెల 3న మైలార్దేవ్పల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు స్పాట్లోనే చనిపోయారు. ఇటీవల మాదాపూర్ మై హోం అబ్రా వద్ద డ్రంకెన్ డ్రైవ్ కారణంగా జరిగిన యాక్సిడెంట్లో ఆటోడ్రైవర్ మృతి చెందాడు. ఇలాంటి ప్రమాదాలు గ్రేటర్లో టెర్రర్ పుట్టిస్తున్నాయి. డైలీ సగటున ఐదుగురి ప్రాణాలు తీస్తున్నాయి’.
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ రోడ్లపై జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలు వాహనదారులను హడలెత్తిస్తున్నాయి. నిర్లక్ష్యపు డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవ్, ఓవర్స్పీడ్ ఇందుకు కారణమవుతున్నాయి. ఈ ఏడాది రిజిస్టరైన యాక్సిడెంట్ కేసుల ఆధారంగా ప్రమాదాల నివారణకు పోలీసులు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం జనవరి నుంచి జూన్ వరకు జరిగిన రోడ్డు ప్రమాదాలను స్టడీ చేస్తున్నారు. ఈ 6 నెలల కాలంలో గ్రేటర్లో ప్రతి నెల సగటున 137 మంది యాక్సిడెంట్లలో చనిపోయారు. ఇందులో 30 శాతం మంది పాదచారులున్నారు. రోడ్ సేఫ్టీపై పోలీసులు ఎన్ని అవేర్ నెస్ ప్రోగ్రామ్స్ రూపొందించినా కొందరు వాహనదారులు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్నారు. దీంతో సిటీ రోడ్లతో పాటు నేషనల్ హైవేలు,ఔటర్ రింగ్ రోడ్లపై వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి.డ్రంకెన్ డ్రైవ్, ఓవర్ స్పీడ్తో వెళ్తూ కొందరు వాహనదారులు ఎదుటి వారి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. బైక్ యాక్సిడెంట్లలో చాలామంది హెల్మెట్ వాడకపోవడంతోనే చనిపోతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు.
68 శాతం యువతే..
ఈ ఏడాది ఆరు నెలల కాలంలో జరిగిన రోడ్డు ప్రమాదాలకు 68 శాతం యువతే కారణమవుతున్నట్లు పోలీసు కేస్ట్ స్టడీస్ చెప్తున్నాయి. ఈ ఏడాది డ్రంకన్ డ్రైవ్ ప్రమాదాలు పెరిగిపోయినట్లు గుర్తించారు. మరోవైపు ట్రాఫిక్ రద్దీగా ఉండే ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య సమయంలో యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగినట్లు పోలీసులు గుర్తించారు. రాత్రి11 గంటల తర్వాత బైక్లపై వెళ్లేవారు ఎక్కువగా ప్రమాదాలకు
గురవుతున్నారు. ఇందుకు కారణం ఖాళీగా ఉన్న రోడ్లపై ఓవర్ స్పీడ్తో డ్రైవ్ చేయడమేనని ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. ప్రమాదాల నివారణ కోసం వాహనదారుల్లో మరింత అవేర్నెస్ కలిగించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.