28 రోజులకే రెండో డోసు

28 రోజులకే రెండో డోసు

హైదరాబాద్‌, వెలుగు: కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య గ్యాప్‌ను 84 రోజుల నుంచి 28 రోజులకు తగ్గిస్తూ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిబంధన విదేశాలకు వెళ్లే వాళ్లకు మాత్రమే వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. వర్క్ పర్మిట్ వీసాపై విదేశాలకు వెళ్తున్న వాళ్లు కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని, 28 రోజుల గ్యాప్‌తో రెండు డోసులు వేస్తామని ఆయన తెలిపారు. హైదరాబాద్‌ సహా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని ఒక్కో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌‌(యూపీహెచ్‌సీ)లో వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు.  విదేశాలకు వెళ్లేవాళ్లు, తమ పాస్‌పోర్టు, వీసా చూపించి ఈ సెంటర్లలో వ్యాక్సిన్ వేయించుకోవచ్చని డీహెచ్ వివరించారు. కొవిన్ పోర్టల్‌లో ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, పాస్‌పోర్టు, వీసా చూపించి వ్యాక్సిన్ వేయించుకోవచ్చని సూచించారు.