కస్టమర్ల నుంచి సులువుగా డిజిటల్ పేమెంట్లను తీసుకునేందుకు వీలుగా ప్రముఖ ఐటీ సేవల కంపెనీ గూగుల్.. వ్యాపారులు, వ్యాపార సంస్థల కోసం ‘గూగుల్ పే బిజినెస్’ యాప్ను బుధవారం హైదరాబాద్లో ఆరంభించింది. దీని ద్వారా జరిగే లావాదేవీలన్నీ ఉచితమని, కస్టమర్ దగ్గర గానీ వ్యాపారుల దగ్గర గానీ ఎలాంటి కమీషన్లు తీసుకోబోమని తెలిపింది. తమ యాప్ ద్వారా పేమెంట్స్ అంగీకరించినందుకు క్యాష్బ్యాక్లు కూడా ఇస్తామని తెలిపింది. చిన్న, మధ్యతరహా బిజినెస్లకు ఇది ఎంతో ప్రయోజనకరమని గూగుల్ పేర్కొంది. షాపులో ఉండే క్యూఆర్ కోడ్ లేదా, ఫోన్ నంబరు ఆధారంగా డబ్బు చెల్లించవచ్చు. ఈ మొత్తం వెంటనే వ్యాపారి బ్యాంకు అకౌంట్లో జమ అవుతుంది. ఈ సందర్భంగా గూగుల్ పే అండ్ ఎస్బీయూ ఇనీషియేటివ్స్ ఎండీ అండ్ బిజినెస్ హెడ్ సజిత్ శివానందన్ విలేకరులతో మాట్లాడుతూ ‘‘మనదేశంలో యూపీఐ విధానం ద్వారానే అత్యధికులు పేమెంట్స్ జరుపుతున్నారు. ఇప్పుడు ఇండియావ్యాప్తంగా మూడు వేల కంపెనీలు గూగుల్ పే పేమెంట్స్ను తీసుకుంటున్నాయి. కొత్తగా వేల సంఖ్యలో చిన్న, మధ్య తరహా వ్యాపారులు బిజినెస్ యాప్ను వాడుతున్నారు. వీడియోకాల్ ద్వారా వ్యాపారి షాపును పరిశీలించి బిజినెస్ అకౌంట్ ఇస్తాం. 3,500 నగరాలు, పట్టణాల్లోని 20 వేల షాపుల్లో పీఓఎస్ టెర్మినల్స్ను కూడా ఏర్పాటు చేస్తాం. గూగుల్ పే లావాదేవీల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. మెషీన్ లెర్నింగ్ ద్వారా మోసాలకు అడ్డుకట్ట వేస్తున్నాం. ప్రతి లావాదేవీకీ రక్షణ ఉంటుంది. ఈ విషయంలో ప్రభుత్వంతోనూ కలసి పనిచేస్తున్నాం. డేటా స్టోరేజీ విషయంలో ఆర్బీఐ రూల్స్ ప్రకారం వ్యవహరిస్తాం. గూగుల్ పే లావాదేవీల్లో 60 శాతం మెట్రోయేతర ప్రాంతాల నుంచే జరుగుతున్నాయి. డబ్బు చెల్లింపులేగాక టికెట్ బుకింగ్, రీచార్జులు, బిల్లుల చెల్లింపునకూ మా యాప్ను వాడుకోవచ్చు. బంగారం కూడా కొనుక్కోవచ్చు”అని సజిత్ వివరించారు.