- రాష్ట్ర సర్కారుకు హైకోర్టు ఆదేశం
- ఎందుకు కూల్చుతున్నారో వివరణ ఇవ్వాలె
- మార్కెటింగ్ సెక్రటరీ, డైరెక్టర్ విచారణకు రావాలె
- ఓపెన్ చేయమంటే కూల్చివేత పనులా అని ఫైర్
హైదరాబాద్, వెలుగు: గడ్డిఅన్నారం మార్కెట్ కూల్చివేత పనులను వెంటనే ఆపాలని రాష్ట్ర సర్కారును హైకోర్టు ఆదేశించింది. మార్కెట్ ఓపెన్ చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నెలరోజులైనా అమలు చేయలేదని, ఇప్పుడు పోలీసులను మోహరించి కూల్చివేత పనులు చేపడతారా అని ఫైర్ అయ్యింది. కోర్టు ఆర్డర్స్కు వ్యతిరేకంగా కూల్చివేత పనులు చేపట్టడం దారుణమని మండిపడింది. కూల్చివేత పనులు ఎందుకు చేపట్టారో మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్ స్వయంగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి డివిజన్ బెంచ్ మంగళవారం ఉత్తర్వులిచ్చింది. మార్కెట్ తెరవాలని హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ను నెలరోజులైనా సర్కారు అమలు చేయలేదని సీనియర్ లాయర్ గంగయ్యనాయుడు గుర్తుచేశారు. బాటసింగారానికి మార్కెట్ను తరలించే గడువు మంగళవారంతో ముగుస్తుందని, అయితే సోమవారం అర్ధరాత్రి నుంచే 500 మంది పోలీసులను మోహరించి మార్కెట్ కూల్చివేత పనులు ప్రారంభించారని అన్నారు. మూడు రోజుల్లో మార్కెట్ ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని, లోపలికి వెళ్తున్న కమీషన్ ఏజెంట్లపై క్రిమినల్ కేసులు పెడుతున్నారని లాయర్ చెప్పారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన బెంచ్.. కోర్టు ధిక్కరణ కేసులో ప్రతివాదులైన మార్కెట్ డైరెక్టర్ లక్ష్మీభాయ్, సెక్రటరీ రఘునందన్రావు తదుపరి విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది.