ఎయిరిండియా విమానాలపై హాంకాంగ్‌ ప్రభుత్వం నిషేధం

ఎయిరిండియా విమానాలపై హాంకాంగ్‌ ప్రభుత్వం నిషేధం

వందే భారత్ మిషన్ పథకం కింద విదేశీయులను చేరవేస్తున్న ఎయిరిండియాకు మరోసారి ఊహించని షాక్ తగిలింది. ఎయిరిండియా విమానంలో ప్రయాణికుడికి కరోనా పాజిటివ్ రావడంతో హాంకాంగ్‌ ప్రభుత్వం విమానాల రాకపోకలను నిషేధించింది. అక్టోబర్ 3వ తేదీ వరకు హాంకాంగ్‌కు ఎయిరిండియా కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ప్రయాణికులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆగస్టు 18న హాంకాంగ్ ఎయిరిండియా విమానాలను ఆగస్టు 31వరకు సస్పెండ్ చేసింది.

ఈ నెల 18న హాంకాంగ్ వెళ్లిన ఐదుగురు భారతీయులు కరోనా బారినపడ్డారు. వీరంతా కాథే డ్రాగన్ విమానంలో కౌలాలంపూర్ నుంచి హాంకాంగ్ వెళ్లినట్టుగా తేలింది. ముందుగా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్‌తో ప్రయాణం చేసినప్పటికీ వారికి కరోనా పాజటివ్ గా నిర్ధారణ జరిగింది. దీంతో అక్కడి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సెప్టెంబర్ 20 నుండి అక్టోబర్ 3 వరకు రెండు వారాల పాటు నిషేధాన్ని విధిస్తున్నట్టు హాంకాంగ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకటించింది.ఇప్పటికే ఇలాంటి ఆరోపణలతో దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కార్యకలాపాలను అక్టోబర్ 2 వరకు నిలిపివేసింది.