ముంబై:మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై టెన్షన్ కొనసాగుతున్నది. సీఎం సీటును పంచుకోవాల్సిందేనని పట్టుపట్టిన శివసేన పార్టీ గురువారం తన ఎమ్మెల్యేలను స్టార్ హోటల్కు తరలించింది. శనివారంతో గత అసెంబ్లీ గడువు ముగియనుండటంతో ఆ లోపే ప్రభుత్వం ఏర్పాటుకాకుంటే రాష్ట్రపతి పాలన విధింపు అనివార్యమయ్యే పరిస్థితి నెలకొంది. అయితే అసెంబ్లీ గడువు ముగిసిన వెంటనే రాష్ట్రపతి పాలన విధించబోరని, కొత్త సర్కార్ ఏర్పాటుకు కొంత సమయం ఇచ్చే అవకాశాలున్నట్లు రాజ్భవన్ వర్గాలు నుంచి లీకులు రావడం చర్చనీయాంశైమంది.
క్యాష్ బ్యాగ్స్ ఆఫర్ చేస్తున్నారు!
మహారాష్ట్రలో కూటమి ప్రభుత్వమే ఏర్పాటవుతుందని, ఆ మేరకు అవసరమైన న్యాయపరమైన అంశాలను గవర్నర్ భగత్సింగ్ కోష్యారీతో చర్చించామని మహారాష్ట్ర బీజేపీ చీప్ పాటిల్ మీడియాకు చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ను కోరలేదని స్పష్టం చేశారు. అందుకుముందు ఆయనే తమకు182 మంది ఎమ్మెల్యేల మద్దతుందని చెప్పారు. పాటిల్ కామెంట్స్పై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందిస్తూ, బలం లేకుండానే పవర్లోకి వద్దామనుకోవడం బీజేపీ అధికార దాహానికి నిదర్శనమని విమర్శించారు. శివసేన ఎమ్మెల్యేలకు బీజేపీ నేతలు క్యాష్ బ్యాగ్స్ ఆఫర్ చేస్తున్నారని సామ్నా పత్రికలో ఆరోపించారు. ప్రలోభాలకు గురికాకుండా తన 56 మంది ఎమ్మెల్యేలు, సపోర్ట్ ప్రకటించిన మరో ఆరుగురు ఇండిపెండెంట్లతో శివసేన బాంద్రాలోని రంగ్శర్దా స్టార్హోటల్లో క్యాంప్ ఏర్పాటుచేసింది. అంతకుముందు వారితో శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే భేటీ మాట్లాడుతూ ‘‘బీజేపీతో కాంప్రమైజ్ కాదల్చుకుంటే 15 రోజులు టైమ్ వేస్ట్ చేసేవాళ్లమేకాదు. ఫిఫ్టీ ఫిఫ్టీపై మనం వెనక్కితగ్గే ప్రసక్తేలేదు’’అని చెప్పారు.