న్యూఢిల్లీ: దేశంలోని కరోనా కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరుగుతోందని హెల్త్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మే నెలలో చేసిన ఐసీఎంఆర్ సీరమ్ సర్వేతో ప్రస్తుత రియాల్టీ తెలియదని, ఏప్రిల్ నాటి పరిస్థితే తెలుస్తుందని అంటున్నారు. పైగా కంటెయిన్మెంట్ ఏరియాలను వదిలి సర్వే చేస్తే అసలు సంగతి ఎట్ల బయట పడుతుందని అడుగుతున్నారు. ఢిల్లీ, ధారావిలో టెస్టులు చేసుంటే కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరుగుతోందా లేక అంతకుమించిన పరిస్థితి ఉందా తెలిసేదన్నారు.
కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ కాకుంటే ఇంకేంటో?
దేశంలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఉందనడంలో డౌటే లేదని ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ ఎంసీ మిశ్రా అన్నారు. లాక్డౌన్ ఎత్తేయడం, జనాలు గుంపులుగా బయటకి వస్తుండటంతో ఇప్పటివరకు కేసుల్లేని ప్రాంతాలకూ వైరస్ వ్యాపించిందని చెప్పారు. ఇన్ఫెక్షన్ వ్యాపిస్తోందో లేదో తెలుసుకోవడానికి 26 వేల శాంపిల్స్ చాలవని, దేశంలో జనాభా ఎక్కువన్న విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. లీడింగ్ వైరాలజిస్ట్, హెపటైటిస్ ఈ వైరస్, హెచ్ఐవీపై పరిశోధన చేసిన ఫేమస్ సైంటిస్టు షాహిద్ జమీల్ కూడా దేశంలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఎప్పుడో స్టార్టయిందని చెప్పారు. ‘ఐసీఎంఆర్ చేసిన సెవెర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ సర్వేలో పాజిటివ్ తేలిన 40 శాతం మందికి విదేశాల నుంచి వచ్చిన ట్రావెల్ హిస్టరీ లేదు. వైరస్ ఉన్నోళ్లతో కాంటాక్ట్ కూడా కాలేదు. మరి ఇది కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ కాకపోతే ఇంకేంటో చెప్పాలి’ అని అడిగారు. ఐసీఎంఆర్ వాదనే నిజమైనా కనీసం ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబైలలోనైనా కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఉండే ఉంటుందని ఫేమస్ లంగ్ సర్జన్ అర్వింద్ కుమార్ అన్నారు. ‘యాంటీబాడీలు డెవలప్ కావాలంటే కనీసం రెండు వారాలు పడుతుంది. ఏప్రిల్లో సర్వే చేశారు. ఆ టైమ్లో మనం చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. లాక్డౌన్ నడుస్తోంది. అప్పటి సర్వే ఆధారంగా మన దగ్గర కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ లేదనడం కరెక్ట్ కాదు’ అన్నారు. నీతిఆయోగ్ మెంబర్ వీకే పాల్ కూడా సర్వేపై కామెంట్ చేశారు. మే మూడో వారంలో సర్వే చేశారని, యాంటీ బాడీస్ డెవలప్ అయ్యే పరిస్థితిని బట్టి అది ఏప్రిల్ 30 వరకు దేశంలో ఉన్న పరిస్థితిని తెలుపుతుందని అన్నారు.