- ఆర్థిక స్వతంత్రత కోసం ఫీజులు పెంచాలంటున్న ఐఐటీలు
- ప్రతిపాదనలపై కమిటీ వేసిన హెచ్ఆర్డీ
ఫ్యాకల్టీల జీతాలు, కాలేజీల మెయింటెనెన్స్, ఇతర ఖర్చులనూ స్టూడెంట్ల ఫీజులోనే రాబట్టాలని ఐఐటీలు భావిస్తున్నాయి. అందుకు తగ్గట్టే ఆర్థిక స్వతంత్రత కోసం ఫీజులను పెంచాలన్న నిర్ణయానికొచ్చాయి. అంతేకాదు, ఇనిస్టిట్యూట్ల ఆదాయం పెరిగేలా కాలేజీల్లో స్టూడెంట్ల సంఖ్యనూ పెంచాలని భావిస్తున్నాయి. ఈ మేరకు గత శుక్రవారం జరిగిన ఐఐటీ కౌన్సిల్ మీటింగ్లో ప్రతిపాదనలు పెట్టాయి. ఇక, జీతాలు, మెయింటెనెన్స్ ఖర్చులు ట్యూషన్ ఫీజు నుంచి తీసుకున్నా, ఇతర మౌలిక వసతులకు సంబంధించిన ఖర్చులకు గానూ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ ఏజెన్సీ (హెచ్ఈఎఫ్ఏ) నుంచి లోన్ల ద్వారా డబ్బును సమకూర్చుకుంటామని ఐఐటీలు ప్రతిపాదించాయి. పెంచిన ఫీజులను తట్టుకునేలా స్టూడెంట్ల ఆర్థిక స్థితిగతులకు తగ్గట్టు నగదు బదిలీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) ద్వారా కేంద్ర ప్రభుత్వం స్కాలర్షిప్పులు ఇవ్వాలని సూచించింది. ‘‘ఆదాయ సృష్టిలో అడ్డంకులను అధిగమించేందుకే ఈ ఆర్థిక స్వతంత్రత ఉద్దేశం. ప్రస్తుతం ఐఐటీల అభివృద్ధికి కేంద్రం ఇచ్చే బడ్జెట్పైనే ఆధారపడుతున్నాం. ఆర్థిక స్వతంత్రత వల్ల ప్రభుత్వం ఇచ్చే నిధులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుంది” అని ఓ ఐఐటీ డైరెక్టర్ చెప్పారు. అయితే, దీని వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సాయం తగ్గుతుందని కొన్ని ఐఐటీల అధికారులు అంటున్నారు. ఆర్థిక స్వతంత్రత వల్ల ఇనిస్టిట్యూట్లు అభివృద్ధి చెందడంతో పాటు రీసెర్చ్కు ప్రాధాన్యం పెరుగుతుందని హెచ్ఆర్డీ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ అన్నారు. అయితే, ఓ నిర్ణయానికి వచ్చేముందు ఐఐటీల ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఆయన చెప్పారు. ఆ ప్రతిపాదనలపై కమిటీ వేశామన్నారు