యుగీన్ : వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్లో ఇండియా అథ్లెట్ అన్ను రాణి సత్తా చాటింది. విమెన్స్ జావెలిన్ త్రోలో వరుసగా రెండో ఎడిషన్లో ఫైనల్ చేరుకుంది. గురువారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్లో రాణి జావెలిన్ను 59.60 మీటర్ల దూరం విసిరి గ్రూప్–బిలో ఐదో స్థానంలో నిలిచింది. రెండు గ్రూపుల నుంచి టాప్–8 అథ్లెట్లు ఫైనల్ చేరగా.. రాణికి కూడా చోటు దక్కింది. 29 ఏళ్ల అన్ను రాణి తొలి త్రోలోనే ఫౌల్ చేసింది. రెండో ప్రయత్నంలో 55.30 మీ. మాత్రమే సాధించిన ఆమె మూడో, చివరి ప్రయత్నంలో మాత్రం 59.60 మీ. దూరం విసిరినా.. తన పర్సనల్ బెస్ట్ మార్కును అందుకోలేకపోయింది. శనివారం ఉదయం జరిగే ఫైనల్లో అన్ను తన పెర్ఫామెన్స్ను మెరుగు పరుచుకునే అవకాశం ఉంది. ఈ సీజన్తో పాటు తన పర్సనల్ బెస్ట్ అయిన 63.82 మార్కును అందుకుంటే పతకం నెగ్గే చాన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే రెండు గ్రూపుల క్వాలిఫికేషన్స్లో ముగ్గురు మాత్రమే ఆటోమేటిక్ క్వాలిఫికేషన్ మార్కు అయిన 62.50 మీ. దూరం దాటారు. కాగా, విమెన్స్ 5000 మీ రన్నింగ్లో పారుల్ చౌదరి సెమీఫైనల్ చేరుకోలేకపోయింది. రెండో నంబర్ హీట్స్లో 15:540.3 టైమింగ్తో 17వ స్థానం, ఓవరాల్గా 31వ స్థానంతో నిరాశ పరిచింది.
నీరజ్ ఏం చేస్తాడో
ఈ మెగా ఈవెంట్లో ఇండియాకు మెడల్ అందిస్తాడని ఆశిస్తున్న ఒలింపిక్ చాంపియన్, స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా శుక్రవారం క్వాలిఫికేషన్ రౌండ్లో బరిలోకి దిగుతున్నాడు. గ్రూప్–ఎలో చోప్రాతో పాటు టోక్యో ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ జాకుబ్ (చెక్ రిపబ్లిక్), 2012 లండన్ ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విన్నర్ కెషోర్న్ (ట్రినిడాడ్) కూడా పోటీలో ఉన్నారు. డిఫెండింగ్ చాంపియన్ పీటర్స్ (గ్రెనడా) పోటీ పడుతున్న గ్రూప్–బిలో మరో ఇండియన్ రోహిత్ యాదవ్ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.