జమైత్ ఉల్ మోమినాత్ ఇన్స్టిట్యూషన్స్ కోర్సులపై ఇంటర్ బోర్డుకు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మొగల్పురాలోని జమైత్-ఉల్-మోమినాత్ ఉమెన్ ముస్లిం మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నిర్వహిస్తున్న కోర్సులను గుర్తించాలని రాష్ట్ర మైనార్టీ కమిషన్ ఇంటర్మీడియెట్ బోర్డును ఆదేశించింది. శనివారం హైదరాబాద్ మైనార్టీ కమిషన్ ఆఫీసులో 12 కేసులపై చైర్మన్ మహ్మద్ ఖమ్రుద్దీన్ నేతృత్వంలోని కమిషన్ విచారణ చేపట్టింది. డీటెయిల్డ్ రిపోర్టు ఇచ్చేందుకు 4 వారాల సమయం ఇవ్వాలని విచారణకు హాజరైన ఇంటర్ బోర్డు జాయింట్ సెక్రటరీ.. కమిషన్ను కోరారు. దీంతో తదుపరి విచారణను కమిషన్ చైర్మన్ నవంబర్ 23 కు వాయిదా వేశారు. విచారణలో కమిషన్ వైస్ చైర్మన్ బి. శంకర్ లూకే, సభ్యుడు ఎంఏ అజీమ్, రిటైర్డ్ జడ్జి ఎంఏ బాసిత్, సలహాదారులు ఫరూఖ్ అలీ, ఎంఏ ఖాదీర్ సిద్దిఖీ, ఎంఏ రఫీ పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాలోని వక్ఫ్ భూముల ఆక్రమణ, ఎల్బీ నగర్ డివిజన్లోని హయత్నగర్లో జీహెచ్ఎంసీ అనుమతితో నిర్మిస్తున్న భవన అనుమతులు రద్దు చేసి.. ఆ ప్రాంతాలను సందర్శించాలని కమిషన్ నిర్ణయించింది. వ్యక్తిగత, రెవెన్యూ సంబంధిత కేసులపై విచారణ జరిపిన కమిషన్.. కేసులను నవంబర్ 23కు వాయిదా వేసింది.