- ఇంట్లో ఫెసిలిటీస్ లేని పాజిటివ్ పేషెంట్లు ఉండేందుకు అవకాశం
- ముందుగా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ఫోకస్
- వారం రోజుల్లో అందుబాటులోకి తెస్తామంటున్న బల్దియా అధికారులు
గ్రేటర్పరిధిలో ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు కాబోతున్నాయి. కరోనా సెకండ్వేవ్ తో కేసులు పెరుగుండటంతో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు బల్దియా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కరోనా పాజిటివ్ వచ్చి ఇంట్లో ఉండేందుకు వీలు లేని వారు ఈ ఐసోలేషన్ సెంటర్లలో ఉండేలా జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్, కమ్యూనిటీ , ఫంక్షన్ హాల్స్, ఇండోర్ స్టేడియాల్లో అధికారులు ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాట్లు చేయనున్నారు. ఇప్పటికే భవనాలను గుర్తించిన జోనల్ కమిషనర్లు ఆ వివరాలను బల్దియా కమిషనర్ లోకేష్ కుమార్కి పంపినట్లు సమాచారం. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ముందుగా ఈ సెంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఒక్కో సెంటర్ కెపాసిటిని బట్టి బెడ్స్ తో పాటు ఆక్సిజన్, హెల్త్ స్టాఫ్ ని కూడా అందుబాటులో ఉంచనున్నారు. ఒక్కో జోన్లో 500 నుంచి వెయ్యి బెడ్స్ ఉంటాయని అధికారులు చెప్తున్నారు. గతేడాది ఆగస్టులో కూడా ఐసోలేషన్ సెంటర్ల కోసం బిల్డింగ్ లను అధికారులు గుర్తించారు. కానీ సెంటర్ల ఏర్పాటు మొదలుపెట్టేలోగా కేసులు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడంతో అంతటితోనే అధికారులు వదిలేశారు. అవసరమైతే అప్పట్లో గుర్తించిన భవనాల్లోనే ఐసోలేషన్ సెంటర్లను ప్రస్తం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు.
ఇంట్లో ఒకరి నుంచి మరొకరికి..
చిన్న చిన్న ఫ్యామిలీస్లో ఒకరికి కరోనా వస్తే కుటుంబ సభ్యులంతా వైరస్ బారిన పడుతున్నారు. సింగిల్ రూమ్స్, బెడ్రూం ఉన్న ఇండ్లల్లో కరోనా వచ్చిన వారు ఐసోలేషన్లో ఉండటం కష్టమే. ఇలాంటి కుటుంబాల్లో ఒకరికి కరోనా వస్తే ఇంట్లోని వారందరికీ పాజిటివ్ వస్తోంది. ప్రస్తుతం వస్తున్న కేసుల్లో ఇవే ఎక్కువగా ఉంటున్నాయి. ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్ ఉంటే కుటుంబ సభ్యులను ఇంట్లో ఉంచి కరోనా వచ్చిన వారు మాత్రమే ఇక్కడ ఉండొచ్చు. దీనివల్ల ఇంట్లోని మిగతావారికి కరోనా వ్యాప్తి కాకుండా ఉంటుంది.
ఆక్సిజన్ తో పాటు హెల్త్ స్టాఫ్....
ఐసోలేషన్ సెంటర్కి పాజిటివ్తో వచ్చిన వారు నెగెటివ్తోనే ఇంటికి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రతి సెంటర్లో బెడ్స్ తో పాటు ఎమర్జెన్సీ అయితే వినియోగించేందుకు ఆక్సిజన్, హెల్త్ స్టాఫ్ కూడా అందుబాటులో ఉండనున్నారు. పేషెంట్ పరిస్థితి ఒకవేళ సీరియస్ అయితే ఇతర హాస్పిటల్స్లో అడ్మిట్ చేయనున్నారు. అత్యవసరం కోసం మాత్రమే హెల్త్స్టాఫ్ని
ఉంచనున్నారు.
ప్రతి జోన్లో 5 నుంచి 10
ప్రస్తుతం కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీలైనంత త్వరగా ఐసోలేషన్ సెంటర్లు అందుబాటులోకి తీసుకురావాలని జీహెచ్ఎంసీ బావిస్తుంది. కొండాపూర్లోని సైబర్ కన్వెన్షన్, గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్, కొంపల్లిలోని మల్లా రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీల్లో ఐసోలేషన్ సెంటర్లను కొద్దిరోజుల్లోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటితో పాటు ప్రతి జోన్ లో కేసుల తీవ్రతను బట్టి 5 –10 వరకు సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. గతేడాది గుర్తించిన భవనాల్లో ఏర్పాటు చేయాలని జోనల్ ఆఫీసర్లు బల్దియా కమిషనర్ని కోరినట్లు తెలిసింది. ఖైరతాబాద్ జోన్లోని సైఫాబాద్ యునివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్, లంగర్హౌస్ లోని అంబెద్కర్ గవర్నమెంట్ స్కూల్, చాదర్ఘాట్ లోని విక్టోరియా ఇండోర్ స్టేడియం, నిమ్స్ లోని షెల్టర్ హోమ్, షేక్పేట్లోని ఓవాసిస్ స్కూల్ ల్లో ఏర్పాటు చేయాలని గుర్తించారు. ఈ సారి కూడా వీటితో పాటు మరిన్ని భవనాలను గుర్తించినట్లు తెలిసింది. అన్ని జోన్లలో వారం నుంచి 10 రోజుల్లోగా సెంటర్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయనున్నారు.
ఎన్జీవోల ముందుకు రావాలని పిలుపు..
ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ఎన్జీవోలు ముందుకురావాలని గత కొద్దిరోజులుగా అధికారులు కోరుతున్నారు. గతేడాది ఎన్జీవోలు ఎంతో మంది వలస కార్మికుల వసతి కల్పించారు. కార్మికులు తమతమ గ్రామాలను వెళ్లేంత వరకు మూడు పూటల భోజనంతో పాటు షెల్టర్ కల్పించారు. అదే విధంగా ఇప్పుడు కూడా కరోనా పాజిటివ్ వచ్చి హోమ్ ఐసోలేషన్లో వీలులేని వారికోసం సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ఎన్జీవోలు ముందుకు రావాలని కోరుతున్నారు.