- ల్యాండింగ్ రోజే పాడైపోయిందన్న ఇస్రో సైంటిస్టులు
- 200 కిలోమీటర్ల వేగంతో జాబిలితో ఢీ
- ఆటోమేటిక్ ల్యాండింగ్ ప్రోగ్రాంలో లోపాలు
- నాలుగు ఇంజన్లకు బదులు ఒక్క ఇంజన్నే పెడితే బాగుండేది
విక్రమ్ స్పందిస్తుందని యావత్ భారతావని 14 రోజులుగా ఆశలతో ఉంది. కానీ, అది చడీ చప్పుడు లేకుండా చందమామ ఒడిలో నిద్రపోతోంది. సూర్యుడు ఉన్నన్ని రోజులూ నిద్రలోనే ఉంది. ఇప్పుడు చీకటి పడడంతో శాశ్వత నిద్రలోకి జారిపోతోంది. కానీ, విక్రమ్ ల్యాండింగ్ రోజైన సెప్టెంబర్ 7నే అది పూర్తిగా ‘డెడ్’ అయిందన్న విషయం ఎవరికీ తెలియదు. ఇస్రో టాప్ సైంటిస్టులు స్వయంగా చెబుతున్న మాటిది. అవును, ల్యాండింగ్ రోజే విక్రమ్ పూర్తిగా చేయిదాటిపోయిందని చెబుతున్నారు. ఆటోమేటిక్ ల్యాండింగ్ ప్రోగ్రామ్ (ఏఎల్పీ)లో వచ్చిన లోపం వల్లే విక్రమ్కు పెద్ద యాక్సిడెంట్ జరిగిందంటున్నారు. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో జాబిల్లిని విక్రమ్ ఢీకొట్టిందంటున్నారు. అంత స్పీడ్తో ఢీకొట్టడం వల్ల అందులోని పరికరాలు, వ్యవస్థలన్నీ పాడైపోయాయంటున్నారు. ‘‘కచ్చితంగా విక్రమ్ తన కాళ్లపై నిలబడలేదు. అక్కడ పడిన నీడలో దాని రెండు కాళ్లు పైకి ఉండడం కనిపించింది. కాబట్టి అది తలకిందులుగానైనా పడి ఉండొచ్చు లేదంటే ఓ పక్కకు ఒరిగి ఉండొచ్చు” అని చంద్రయాన్–2 సైంటిస్టు ఒకరు చెప్పారు. చందమామకు 330 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడే విక్రమ్తో సంబంధాలు తెగిపోయాయని చెప్పారు. అంతకుముందు ఇస్రో చెప్పినట్టు 2.1 కిలోమీటర్ల ఎత్తులో విక్రమ్తో లింక్ కట్ అయిపోలేదన్నారు. ‘‘విక్రమ్ తలకిందులుగా అయినప్పుడు బ్రేకులుగా పనిచేయాల్సిన థ్రస్టర్లు, యాక్సిలరేటర్లుగా మారి స్పీడ్ను పెంచేశాయి” అని ఆయన చెప్పుకొచ్చారు. బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ టీం తయారు చేసిన ల్యాండింగ్ ప్రోగ్రామ్లో తప్పులు దొర్లడం వల్లే క్రాష్ అయి ఉండొచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ టీంలు తయారు చేసిన ప్రోగ్రామ్ను పరిశీలిస్తున్నామన్నారు. విక్రమ్లో సింపుల్ టెక్నాలజీని వాడి ఉంటే బాగుండేదని ఇస్రో మాజీ అధికారి ఒకరు చెప్పారు. ఒక్కసారి అనుకున్న మిషన్లో పదే పదే మార్పులు చేయొద్దని, చివరిదాకా ఒకటే ఉండాలని ఆయన అన్నారు. ‘‘స్పేస్ టెక్నాలజీ అంటేనే చాలా కష్టమైనది. అంత కష్టమైన పనిని మరిన్ని కఠినమైన వాటిని చేర్చి మరింత కష్టంగా మార్చకూడదు. విక్రమ్ విషయంలో అదే జరిగింది. ఉదాహరణకు విక్రమ్కు నాలుగు ఇంజన్లను పెట్టారు. అవన్నీ ఒకేలా ఒకేసారి పనిచేసేలా డిజైన్ చేశారు. అవి చాలదన్నట్టు ఐదో ఇంజన్ను మధ్యలో పెట్టారు” అని చెప్పారు. అన్ని ఇంజన్లు కాకుండా 3,500 న్యూటన్ల శక్తి ఉన్న ఒకే ఒక్క ఇంజన్ను పెట్టి ఉంటే బాగుండేదన్నారు. చంద్రుడిపై ల్యాండ్ అయిన ఇతర దేశాలు ఒకే ఒక్క ఇంజన్ను వాడాయని, అందులో సక్సెస్ అయ్యాయని గుర్తు చేశారు. నిజానికి ముందు అనుకున్న దాని కన్నా చంద్రయాన్–2 ప్రయోగంలో చాలా మార్పులు చేశారని ఆ మాజీ అధికారి చెప్పుకొచ్చారు. ల్యాండర్లో నాలుగు ఇంజన్లే పెట్టాలని ముందు అనుకున్నా, ఆ తర్వాత చంద్రుడిపైన లేచే దుమ్మును తట్టుకోవాలన్న ఉద్దేశంతో ఐదో ఇంజన్ను ఏర్పాటు చేశారన్నారు. కానీ, దాని వల్ల స్పేస్ క్రాఫ్ట్ బరువు పెరిగిపోయిందని, ఆ తర్వాత రాకెట్ బరువులో మార్పులు చేయాల్సి వచ్చిందని వివరించారు. ఆ ఐదో ఇంజన్ను ఆన్ చేసినప్పుడే అందులోని వ్యవస్థలన్నీ పనిచేయడం మానేశాయన్నారు. ఫెయిల్యూర్స్కు సంబంధించి ఇస్రో అధికారులు మరిన్ని సిమ్యులేషన్లు చేస్తే బాగుండేదన్నారు.