హైదరాబాద్, వెలుగు: కేసీఆర్లో ఏ మూలనో సమైక్య భావన దాగి ఉందని, అందుకే పార్టీ పేరు నుంచి తెలంగాణ పదాన్ని తీసేశారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా హాల్లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పదం తొలగించడంతోనే కేసీఆర్ బలం పోయిందన్నారు. కేసీఆర్ ఇప్పుడు ఏపీలోకి కూడా వెళ్తున్నారని, అందుకే చంద్రబాబు తెలంగాణలోకి వచ్చారన్నారు.
సైలెంట్గా ఉన్న చంద్రబాబు తెలంగాణకు రావడానికి కేసీఆరే అవకాశం ఇచ్చారన్నారు. ఏపీ జనాన్ని కేసీఆర్ అట్రాక్ట్ చేయలేరని, చంద్రబాబు మాత్రం తెలంగాణ ఓటర్లను ప్రభావితం చేయగలరని అన్నారు. తెలంగాణలో కూటములు, పొత్తులపై చాలా మార్పులు చోటుచేసుకుంటాయని జగ్గారెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ సక్సెస్ అయ్యే పరిస్థితి ఏ మాత్రం లేదన్నారు.
మైనార్టీల లోన్ల కోసం నిధులు పెంచాలి
మైనార్టీ వెల్ఫేర్ స్కీమ్లో లోన్ల కోసం రూ.1,500 కోట్లు కేటాయించాలని సీఎం కేసీఆర్కు జగ్గారెడ్డి లేఖ రాశారు. ప్రస్తుతం మైనార్టీ కార్పొరేషన్కు కేటాయించిన రూ.120 కోట్లు ఏ మూలకూ సరిపోవన్నారు. లోన్లకు అప్లికేషన్ గడువును నెల రోజులపాటు పెంచాలని డిమాండ్ చేశారు.