బిల్డింగ్​ పైనుంచి కూతురితో సహా దూకింది

బిల్డింగ్​ పైనుంచి కూతురితో సహా దూకింది

హైదరాబాద్, వెలుగు: పదమూడేళ్ల కిందట పెళ్లి చేసుకున్నరు.. వారికి ఇద్దరు పిల్లలు.. చిన్నమ్మాయి బర్త్ డే ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవాలనే విషయంలో మాటామాటా అనుకున్నరు. గొడవ పెద్దదైంది. మనస్తాపం చెందిన భార్య.. పాపతోపాటు బిల్డింగ్​పై నుంచి దూకేసింది. ఆమె తల పగిలి చనిపోగా, మూడేళ్ల చిన్నారి  చిన్నగాయాలతో బయటపడింది. హైదరాబాద్​లోని కూకట్​పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. సిరిసిల్ల జిల్లాకు చెందిన రాముతో పద్మజ(33)కు పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఐశ్వర్య(7), అక్షర (3). రాము ఈవెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు.

పద్మజ గృహిణి. కూకట్ పల్లి బాలాజీనగర్ లో ఓ అపార్ట్ మెంట్ లో పెంట్ హౌస్‌‌ కొనుక్కుని ఉంటున్నారు. చిన్న కూతురు అక్షర బర్త్ డే ఎక్కడ ఎలా జరపాలో శనివారం రాత్రి మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో మణికొండలో జరుపుదామని పద్మజ.. కాదు ఇంటివద్దే జరుపుదామని రాము పట్టబట్టారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర గొడవ జరిగింది. మనస్తాపం చెందిన పద్మజ చిన్న కూతురు అక్షరను ఎత్తుకుని రాత్రి 11:45 గంటల సమయంలో నాలుగో అంతస్థు పైనుంచి కిందికి దూకింది. పెద్ద శబ్దం రావడంతో వాచ్ మెన్ వచ్చి చూడగా తలకు గాయమై రక్తపు మడుగులో పద్మజ, పక్కనే చిన్నారి పడి ఉన్నారు. వెంటనే ప్రైవేటు హస్పిటల్​కు తరలించగా, అప్పటికే చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. అక్షర ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. చిన్నారిని మెరుగైన చికిత్స కోసం రెయిన్ బో హస్పిటల్ కు తరలించారు. రాముపై తమకు ఎలాంటి అనుమానం లేదని మృతురాలి తండ్రి చెప్పారని పోలీసులు తెలిపారు.