‘రూలింగ్ పార్టీ లీడర్ల’తో పాత కాంగ్రెస్ నాయకులకు అన్యాయం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

‘రూలింగ్ పార్టీ లీడర్ల’తో  పాత కాంగ్రెస్ నాయకులకు అన్యాయం  : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
  •     గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకొని కేసీఆర్ చేసిన తప్పే కాంగ్రెస్ చేసింది
  •     తుంగతుర్తి ఇష్యూపై సమన్వయ కమిటీ వేయాలి
  •     అసలైన కాంగ్రెస్​ కార్యకర్తలను కాపాడుకుంటా : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మోత్కూరు (యాదాద్రి), వెలుగు  : 'ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో చేరి పెత్తనం చలాయించే 'రూలింగ్ పార్టీ లీడర్ల'తో పాత కాంగ్రెస్​ లీడర్లు, కార్యకర్తలకు అన్యాయం జరుగుతోంది. బీఆర్​ఎస్​లో పదేండ్లు ఉండి.. లాభం పొందినోళ్లు.. ఇప్పుడు కాంగ్రెస్​లో చేరి ముందు సీట్లలో కూర్చుంటుంటే పాతోళ్లు వెనుకకుపోతున్నరు. కొత్తగా వచ్చినోళ్లు అసలైన కార్యకర్తలపై కేసులు కూడా పెడుతున్నరు' అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి అన్నారు. యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెంలో కాంగ్రెస్​లీడర్​ఎలుగు యాదయ్య కుటుంబాన్ని బుధవారం పరామర్శించారు. 

అనంతరం మోత్కూరులో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను బీఆర్​ఎస్​లో చేర్చుకొని కేసీఆర్​ఏ తప్పు చేశారో..? ఇప్పుడు కాంగ్రెస్​పార్టీ కూడా అదే తప్పు చేసిందన్నారు. మెజారిటీ ఉన్నప్పటికీ బీఆర్​ఎస్​నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం వల్ల ఓడిన కాంగ్రెస్​అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చేరిన వాళ్లతో కాంగ్రెస్​కు ఏం లాభమని ప్రశ్నించారు. కొత్తగా వచ్చినోళ్లు పార్టీ పదవులు తీసుకోవడంతో పాటు పాత కాంగ్రెస్​ లీడర్లు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. 

తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాలతో పాటు అనేక చోట్ల ఇదే పరిస్థితి నెలకొందన్నారు. తుంగతుర్తిలో మందుల సామేల్ ను కాంగ్రెస్​ కార్యకర్తలే గెలిపించారన్నారు. కొత్తగా వచ్చినోళ్ల కారణంగా పాత కాంగ్రెస్ నాయకులకు అన్యాయం జరగకుండా సమన్వయ కమిటీ వేయాలని తాను జగ్గారెడ్డికి సూచించినట్లు తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. వారికి అన్యాయం జరగకుండా పార్టీ ఇన్​చార్జి మీనాక్షీ నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్​గౌడ్ అవసరమైతే ఏఐసీసీ పెద్దలతో కూడా మాట్లాడతానని చెప్పారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువతపై లాఠీచార్జీ చేయడం దారుణం అన్నారు. ధర్నా చేస్తున్న రాహుల్​గాంధీ, ప్రియాంకా వాద్రాను అరెస్ట్​ చేయడం 
సరికాదన్నారు.