- తుక్కాపూర్ సర్జ్ పూల్ నుంచి నీళ్లు పంప్ చేసిన ఆఫీసర్లు
- అప్పటికే వానతో కాల్వ నిండా నీళ్లు
- భారీ వరదతో ఎర్రవల్లి దగ్గర్లో తెగిన కెనాల్
- శుక్రవారం తెల్లారి నుంచి మధ్యాహ్నం దాకా పొలాల్లోకి ప్రవాహం
- మిడ్మానేరు నుంచి లిఫ్ట్ చేసిన నీళ్లు వృథా
- పంపింగ్ ఆపేసి, గండిని పూడ్చిన ఆఫీసర్లు
- మధ్యాహ్నం కల్లా పరిస్థితి అదుపులోకి
సిద్దిపేట/గజ్వేల్, వెలుగు: మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్కు నీళ్లను తరలించే గ్రావిటీ కెనాల్కు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఎర్రవల్లి సమీపంలో గండి పడింది. మిడ్మానేరు నుంచి వివిధ దశల్లో లిఫ్టు చేసి తెచ్చిన నీళ్లు వృథాగా పోయాయి. శుక్రవారం తెల్లారి నుంచి మధ్యాహ్నం దాకా నీళ్లు పొలాల్లోకి పారాయి. కాల్వ లైనింగ్ పనుల్లో క్వాలిటీ లేకపోవడం, ఎగువన కురిసిన వర్షాలకు వచ్చే వరదను అంచనా వేయకుండా నీటి పంపింగ్ కొనసాగించడమే గండికి కారణమని తెలుస్తోంది. ఆఫీసర్లు మల్లన్నసాగర్ నుంచి నీళ్ల పంపింగ్ను నిలిపేసి.. జేసీబీలతో గండిని పూడ్చారు.
ఇటు పంపింగ్.. అటు వరద..
మిడ్మానేరు నుంచి వివిధ దశల్లో అనంతగిరికి, అక్కడి నుంచి రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ మీదుగా కొండ పోచమ్మ సాగర్కు అధికారులు కొద్దిరోజులుగా నీటిని తరలిస్తున్నారు. మల్లన్న సాగర్ పూర్తికాకపోవడంతో ఈ రెండు రిజర్వాయర్ల మధ్య 17 కిలోమీటర్ల పొడవుతో గ్రావిటీ కెనాల్ తవ్వారు. 20 మీటర్ల వెడల్పు, ఎనిమిది మీటర్ల లోతు తవ్వి.. పూర్తి స్థాయిలో లైనింగ్ చేసిన ఈ కెనాల్కు తాజాగా గండిపడింది.
మల్లన్నసాగర్ వద్ద తుక్కాపూర్ సర్జ్పూల్ నుంచి మూడు మోటార్లతో ఆఫీసర్లు గురువారం నీటి పంపింగ్ చేపట్టారు.అయితే గురువారం రాత్రి కొండపాక మండలంలో10 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. ఆ వరద కాల్వలోకి చేరింది. ఆఫీసర్లు దీనిని అంచనా వేయకుండా నీటి పంపింగ్ చేశారు. భారీగా నీళ్లు రావడంతో ఎర్రవల్లి శివారులో శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటల టైంలో కెనాల్ తెగింది. సమీపంలోని పొలాల్లోకి భారీగా నీళ్లు పోవడం మొదలైంది. విషయం తెలుసుకున్న ఆఫీసర్లు ఉదయం మల్లన్నసాగర్ సర్జ్పూల్ వద్ద నీటి పంపింగ్ నిలిపేశారు. జేసీబీలను తెప్పించి కాల్వ గండి పూడ్చే పనులు చేపట్టారు. మధ్యాహ్నానికల్లా పరిస్థితి అదుపులోకి వచ్చింది. కొడకండ్ల వద్ద కాల్వలో మట్టి పేరుకుపోవడం, కాల్వ లైనింగ్పనుల్లో క్వాలిటీ లేకపోవడం కూడా గండికి కారణమైందని భావిస్తున్నారు. గత నెల 29న కొండ పోచమ్మ సాగర్రిజర్వాయర్ను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. రెండు వారాల్లోనే కాల్వకు గండిపడడం చర్చనీయాంశంగా మారింది.
ప్రాజెక్టు రిజర్వాయర్ వద్దకు సీఎం
సీఎం కేసీఆర్ శుక్రవారం ఆకస్మికంగా కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ను పరిశీలించారు. సాయంత్రం తన ఫాంహౌస్ నుంచి మర్కూక్ మీదుగా కొండపోచమ్మ సాగర్ కట్టపైకి చేరుకున్నారు. వెహికల్లోనే రిజర్వాయర్ కట్టపై ఒక రౌండ్ తిరిగారు. మెల్లగా వెళ్తూ కట్టను, నీటిని పరిశీలించారు. తర్వాత మర్కూక్ పంపుహౌస్ నుంచి రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోస్తున్న డెలివరీ సిస్టం వద్ద కొద్దిసేపు ఆగి.. పంపింగ్ తీరును పరిశీలించారు. ఆ సమయంలో రెండు మోటార్లు నీటిని ఎత్తిపోస్తున్నాయి. ఈ సందర్భంగా కాసేపు అధికారులతో మాట్లాడారు. రిజర్వాయర్లో ఈత కొట్టడానికి ఎవరూ రాకుండా చూడాలని ఆదేశించారు. రిజర్వాయర్ చుట్టూ గ్రీనరీ ఏర్పాటు చేసి, టూరిజం పరంగా అభివృద్ధి చేయాలని సూచించారు. సీఎం ఆకస్మికంగా రావడంతో కొందరు ఆఫీసర్లు, సెక్యూరిటీ సిబ్బంది తప్ప లోకల్ లీడర్లెవరూ కనిపించలేదు. మీడియా ప్రతినిధులను సైతం రిజర్వాయర్ కట్టపైకి అనుమతించలేదు. సుమారు అరగంట తర్వాత సీఎం తిరిగి ఫామ్హౌస్కు వెళ్లిపోయారు.
అవినీతికి ఇదే నిదర్శనం: వివేక్
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ ఆంధ్రా కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారని.. కమీషన్ల కోసం క్వాలిటీలేని పనులతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. ప్రారంభించిన పది రోజులకే కొండ పోచమ్మ కాల్వ తెగి నీళ్లు వృథా పోయాయని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రాజెక్టుల పేరుతో జనాన్ని మభ్యపెడుతూ, కేసీఆర్, మేఘా కృష్ణారెడ్డి కలిసి నడుపుతున్న అవినీతి బాగోతానికి ఈ ఘటనే నిదర్శనమని ఆరోపించారు.