మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో కనీస సౌలత్లు లేక పేషెంట్లు అవస్థలు పడుతున్నారు. చిరిగిన బెడ్లు, వెలగని లైట్లు కామన్కాగా, వార్డుల్లో కొన్నిచోట్ల ఫ్యాన్లు కూడా లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఉన్న ఫ్యాన్లు సరిగా తిరగకపోవడం వల్ల ఊపిరాడని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పోస్ట్ డెలివరీ వార్డుల్లో బాలింతలు, పసిపిల్లలు ఉక్కపోత, దోమలమోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో పలువురు ఇంటి దగ్గర నుంచి టేబుల్ఫ్యాన్లు తెచ్చుకుంటున్నారు. గవర్నమెంట్హాస్పిటల్లో ఫ్రీగా డెలివరీ చేస్తారని వస్తే ఫ్యాన్లు కొనుక్కోవడం పేదలకు భారంగా మారుతోంది. ఒక వార్డులో 23 బెడ్స్కు పది ఫ్యాన్లు ఉంటే అందులో రెండింటిని ఊడదీశారు. మరో వార్డులో 24 బెడ్స్కు గాను పది ఫ్యాన్లు ఉండగా ఒకటి తొలగించారు. మిగిలిన ఫ్యాన్లలో చాలావరకు స్లోగా తిరుగుతున్నాయి. వార్డుల్లో రద్దీ ఎక్కువగా ఉండడంతో గాలి ఆడటం లేదని, బాలింతలు, పసిపిల్లలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారని బంధువులు చెబుతున్నారు. తాము నాలుగు రోజుల కిందట వచ్చామని, బెడ్పైన ఫ్యాన్ లేకపోవడంతో ఇంటి నుంచి టేబుల్ ఫ్యాన్ తెచ్చుకున్నామని ఒకరు చెప్పారు. మరొకరు రూ.1200 పెట్టి ఫ్యాన్ కొన్నామని తెలిపారు. ఆఫీసర్లు స్పందించి ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని
కోరుతున్నారు.