మతవాద బీజేపీని ఓడించే అవకాశాన్ని సమాజ్వాదీ పార్టీ చేజేతులా జారవిడిచిందని బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి ఆక్షేపించారు. యాదవుల ఓట్లు ఎక్కువగా ఉన్న సీట్లలో కూడా ఎస్పీ ఘోరంగా ఓడిపోయిందని, బేస్ ఓట్లనే సాధించుకోలేనివాళ్లు.. కూటమికి అనుకూలంగా ఓట్లేశారని భావించలేమన్నారు. ఉత్తరప్రదేశ్లో 11 అసెంబ్లీ స్థానాలకు త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీచేస్తుందని స్పష్టం చేసిన ఆమె, మహాకూటమి నుంచి ఎందుకు తప్పుకున్నామో వివరించారు. అయితే ఇది పర్మనెంట్ బ్రేకప్ కాదని, ఎస్పీలో మార్పొస్తే మళ్లీ పొత్తు పెట్టుకుంటామనీ తెలిపారు.
‘‘ఎస్పీ చీఫ్ అఖిలేశ్, ఆయన భార్య డింపుల్ నన్నెంతో గౌరవించారు. మాది రాజకీయ అవకాశవాద పొత్తు కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ మిషన్ను ముందుకు తీసుకెళ్లే పార్టీగా గొప్ప మానవతా లక్ష్యంతో, పాత గొడవలన్నీ మర్చిపోయి ఎస్పీతో కలిసి పనిచేశాం. మాది సులువుగా తెగిపోయే బంధం కాదు. మున్ముందు కష్టసుఖాల్లో కలిసే ఉంటాం. అయితే రాజకీయాల్లో రియాలిటీని గుర్తించడం చాలా ఇంపార్టెంట్. లోక్సభ ఎన్నికలపై మేం చేసిన రివ్యూలో తేలిందేంటంటే, సమాజ్వాదీ పార్టీ తన బేస్ ఓటు బ్యాంకు(యాదవుల ఓట్లు) కోల్పోయింది. లోలోపల ఏం జరిగిందో, ఎందుకు యాదవులు సొంత పార్టీకి దూరమయ్యారో తెలియాల్సిఉంది. యాదవ ఓటర్లు ఎక్కువున్న స్థానాల్లోనూ ఎస్పీ స్ట్రాంగ్ క్యాండేట్లు ఓడిపోవడం మమ్మల్ని(బీఎస్పీని) ఆలోచనలో పడేసింది. ఈవీఎంలపైనా మాకు అనుమానాలున్నాయి. బీఎస్పీ, ఎస్పీ బేస్ ఓట్లు ఒక్కటైన తర్వాత కూడా కూటమి అభ్యర్థులు ఓడాల్సిందికాదు. సరిగ్గా ఈ కారణమే ఎస్పీ నుంచి బీఎస్పీ దూరమయ్యేలా చేసింది. పొత్తుకు కట్టుబడి ఓట్లేసేలా ఎస్పీ కార్యకర్తల్ని మార్చుకునే బాధ్యత అఖిలేశ్పై ఉంది. ఆ పనిలో ఆయన సక్సెస్ అయ్యారనిపిస్తే మళ్లీ కలిసి పనిచేస్తాం. దానికి కొంత టైమ్
పడుతుంది. ఈలోపు జరిగే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తుంది”అని మాయావతిచెప్పారు.
మాదీ ఒంటరిపోరే: అఖిలేశ్..
బీఎస్పీ చీఫ్ మాయావతి ప్రకటనపై ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ స్పందించారు. ‘‘ఒకవేళ మహాకూటమి అంటూ లేకుంటే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మేం కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతాం. పార్టీ నేతలతో చర్చించి ఫైనల్ నిర్ణయం తీసుకుంటాం. అయితే కూటమి ఎందుకు ఫెయిలైందో ఇప్పుడే చెప్పలేను. అన్నిటికంటే ముందు పార్టీ కోసం ప్రాణాలొదిలిన కార్యకర్తలకు న్యాయం దక్కేలా చూస్తాం’’అని అఖిలేశ్ చెప్పారు. మంగళవారం ఘాజీపూర్లో పర్యటించిన ఆయన, ఇటీవల చనిపోయిన ఎస్పీ కార్యకర్త కుటుంబాల్ని పరామర్శించారు. 80 లోక్సభ
స్థానాలున్న యూపీలో కూటమిగా పోటీచేసిన బీఎస్పీకి10, ఎస్పీకి 5 సీట్లు మాత్రమే దక్కిన సంగతి తెలిసిందే.