వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవుతానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పగటి కలలు కంటున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో విపక్ష పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు. ఉప ఎన్నికలు వస్తేనే ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందుతోందని కొంతమంది నాయకులు మాట్లాడటాన్ని ఆయన ఖండించారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు పార్టీ మారి ఉపఎన్నికలకు పోతున్నారని విమర్శించారు.
కింగ్ కోఠి షేర్ గేట్ లో 17 మంది లబ్దిదారులకు దానం షాదీముబారక్ చెక్కులను ప్రభుత్వ అధికారులతో కలసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం పలు బస్తీలు, కాలనీలలో ద్విచక్రవాహనంపై పర్యటించి... స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. వర్షాలకు గుంతలు పడిన ప్రాంతాల్లో వెంటనే మరమ్మతులు చేయాలని సూచించారు. సంబంధిత అధికారులు స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. దేవాలయం లాంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ పై బీజేపీ నాయకులు విమర్శలు చేయడం సరికాదన్నారు.