అవినీతి కట్టలు తెగి పొంగిపొర్లుతున్న‌య్

అవినీతి కట్టలు తెగి పొంగిపొర్లుతున్న‌య్

పనిమంతుడు పందిరేస్తే పిట్టొచ్చి వాలితే.. పుటుక్కున కూలిందట…. అట్లుంది కేసీఆర్ ఎవ్వారం అని ఎద్దేవా చేశారు ఎంపీ రేవంత్ రెడ్డి. కొండపోచమ్మ సాగర్, కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపాలు రోజుకోకటి బయట పడుతున్నాయన్నారు. కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి కేసీఆర్ ఫార్మ్ హౌస్ కు పోయే కాలువకే పెద్ద గండి పడిందన్న రేవంత్.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి నెల కూడా కాలేదని అప్పుడే రెండు ప్రధాన కాలువలు గండ్లు పడ్డాయన్నారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గంలోనే , కేసీఆర్ ఫార్మ్ హౌస్ కు పోయే కాలువ పనుల్లోనే నాణ్యత ఇంత ఘోరంగా ఉంటే.. ఇక రాష్ట్రంలో జరిగిన కాలువలు, జలాశయాల నాణ్యత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు రేవంత్ రెడ్డి.

చిన్న కాలువల పరిస్థితి ఇలా ఉంటే ..ఇక సర్ ఫేస్ లో నిర్మించిన 50 టిఎమ్ సిల మల్లన్న సాగర్, 15 టీఎంసీల కొండపోచమ్మ సాగర్, గందమల్లల పరిస్థితి ఎలా ఉండబోతోందో ఆలోచిస్తే భయం వేస్తోందన్నారు. ఆ జలాశయాలకు ఇలాగే గండిపడితే ఒక్క ఊరు మిగలదని.. వాటి పరిధిలో ఉన్న అన్ని గ్రామాలు జలవిలయంలో కొట్టుకుపోతాయని తెలిపారు రేవంత్ రెడ్డి.

కేసీఆర్, మేఘ కంపెనీ కమీషన్ల కక్కుర్తికి ఈ నాణ్యత లోపలే పరాకాష్ట అన్న ఆయ‌న‌.. లక్ష కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టు లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. అవినీతి సొమ్ముతో కేసీఆర్ రాజకీయ అవినీతికి పాల్పడుతున్నారని.. కాంట్రాక్టర్ అవినీతి, అక్రమాలతోనే కాలువలకు గండి పడిందన్నారు. కాలువ కొట్టుకుపోవడంలో ఊర్లలో ప్రజలకు భారీగా ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు ఎంపీ. వారి ఆహార ధాన్యాలు, బట్టలు, వ్యవసాయ ఉత్పత్తులు కొట్టుకుపోయాయని చెప్పారు. అన్నింటిని వెంటనే అంచనా వేసి కాంట్రాక్టర్ ద్వారా ప్రజలకు పరిహారం ఇప్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సీబీఐ చేత ఈ పనులపై విచారణ జరిపి, అక్రమాలకు పాల్పడ్డవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. రిజర్వాయర్ నుండి కేసీఆర్ ఫాంహౌస్ కు నిర్మించుకున్న కెనాల్ కు గండిపడి శివారు వెంకటాపురం నిండా మునిగిందన్న రేవంత్.. అవినీతి కట్టలు తెగి పొంగిపొర్లుతోందంటూ ఎద్దేవా చేశారు. ఇది కూడా మెగా మేత ఘనతేన‌ని.. ఈ కెనాల్ ను జాతిజలగ ప్రారంభించి వారమే అయ్యింద‌న్నారు ఎంపీ రేవంత్ రెడ్డి.