V6 News

మూతపడ్డ ముద్ర... ఆఫీసులు క్లోజ్

మూతపడ్డ ముద్ర... ఆఫీసులు క్లోజ్

మంచిర్యాల, వెలుగు: తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో నాలుగేండ్ల కింద ప్రారంభమైన ‘ముద్ర అగ్రికల్చర్​ అండ్​ స్కిల్​ డెవలప్​మెంట్​మల్టీస్టేట్​కో ఆపరేటివ్​సొసైటీ’ సంక్షోభంలో కూరుకుపోయింది. గడువు ముగిసినా డిపాజిటర్లకు డబ్బులు చెల్లించలేక రాష్ర్టంలోని పలు బ్రాంచీలను మూసివేశారు. కొవిడ్​కారణంగా కొంతకాలం నుంచి ఆశించిన డిపాజిట్లు రాకపోవడం వల్లే లావాదేవీలు స్తంభించాయని సొసైటీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో రెండు రాష్ర్టాల్లో వేలాది మంది మెంబర్లు తమ పైసలు వస్తాయో రావోనని ఆందోళన చెందుతున్నారు. ముద్ర అగ్రికల్చర్​ అండ్​ స్కిల్​ డెవలప్​మెంట్​మల్టీస్టేట్ కో ఆపరేటివ్​సొసైటీ.. మినిస్ర్టీ ఆఫ్​అగ్రికల్చర్​అండ్​ఫార్మర్స్​ వెల్ఫేర్​కింద సెంట్రల్​కో ఆపరేటివ్​సొసైటీస్​ రిజిస్ర్టార్​ద్వారా 2017లో రిజిస్ర్టేషన్​ పొందింది. తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో క్రమంగా బ్రాంచీలను విస్తరించుకుంటూ వచ్చింది. ఒక్క మంచిర్యాల జిల్లాలోనే 15 బ్రాంచీలను ఏర్పాటు చేసింది. రెండు రాష్ర్టాల్లో సుమారు రెండువేల మంది మార్కెటింగ్​సూపర్​వైజర్లను నియమించుకొని వారి ద్వారా అర్బన్, రూరల్​ ఏరియాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. రూ.100 మెంబర్​షిప్​ ఫీజు, రూ.500 షేర్​తో వేలాది మందిని మెంబర్లుగా చేర్చుకుంది. 

అధిక వడ్డీ ఆశ చూపి..

‘ముద్రలో పొదుపు – మీ బంగారు భవితకు మలుపు’, ‘పెట్టుబడులపై అత్యధిక వడ్డీని పొందండి’ అంటూ అధిక వడ్డీ ఆశచూపింది. 8.33 శాతం వడ్డీతో డెయిలీవైజ్​సేవింగ్స్​స్కీం రూ.30 నుంచి రూ.500 వరకు, 9 నుంచి 10.5 శాతం వడ్డీతో జనరల్​మంత్లీ సేవింగ్స్​స్కీమ్స్​ రూ.వెయ్యి నుంచి రూ.3వేల వరకు ప్రవేశపెట్టింది. రూ.లక్ష ఫిక్స్​డ్​డిపాజిట్లపై ఏడాదికి 9.6 శాతం, ఏడాదిపైన 12 శాతం వడ్డీ చెల్లిస్తామని పేర్కొంది. అలాగే రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఫిక్స్​డ్​ డిపాజిట్లు చేస్తే ఆరేండ్లకు డబుల్, పదేండ్లకు మళ్లా డబుల్​చెల్లిస్తామని ఆశ చూపింది. సీనియర్​సిటిజన్లకు మరో ఆకర్షణీయమైన స్కీంను ప్రకటించింది. ఇలా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే  రూ. 150 కోట్ల
నుంచి 200 కోట్ల డిపాజిట్లు సేకరించినట్లు తెలిసింది.

నమ్మకమే పెట్టుబడిగా బిజినెస్​...

ముద్ర సొసైటీ లోకల్​గా మార్కెటింగ్​ సూపర్ ​వైజర్లను నియమించుకొని వారి ద్వారా నమ్మకమే పెట్టుబడిగా కోట్లలో డిపాజిట్లు సేకరించింది. పట్టణాల్లో చిరు వ్యాపారులను, గ్రామాల్లో రైతు కూలీలను, చిన్న వ్యాపారులను టార్గెట్​గా పెట్టుకొని సేవింగ్స్, డిపాజిట్లు చేయించారు. గతేడాది వరకు బాగానే నడిచినప్పటికీ ఆ తర్వాత కష్టాలు మొదలయ్యాయి. గడువు ముగిసినప్పటికీ డిపాజిటర్లకు తిరిగి చెల్లింపులు చేయకపోవడం, బ్రాంచీలు క్లోజ్​ చేయడంతో ఆందోళన నెలకొంది. ఇటీవల మంచిర్యాల జిల్లా హాజీపూర్ బ్రాంచి పరిధిలోని మెంబర్లు పోలీసులకు కంప్లైంట్​ చేయడంతో మూడు నెలల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. లక్సెట్టిపేట, జన్నారం, భీమారం, ఐబీ తాండూర్, చెన్నూర్​ తదితర బ్రాంచీలను సైతం క్లోజ్ చేశారు. దీంతో డిపాజిటర్లు ముద్ర ఆఫీసులు, పోలీస్​స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. 

డిపాజిట్లు రాకనా.. ఇంకేమైనా మోసమా?

కొవిడ్​ కారణంగా కొంతకాలంగా ఆశించిన డిపాజిట్లు రావడం లేదని, దీంతో పలు బ్రాంచీల్లో లావాదేవీలు స్తంభించాయని ముద్ర సొసైటీ వర్గాలు పేర్కొంటున్నాయి. కొన్ని నెలలుగా మార్కెటింగ్​సూపర్​వైజర్లకు, స్టాఫ్​కు జీతాలు చెల్లించకపోవడంతో చాలామంది వేరే దారి చూసుకుంటున్నారు. పలువురు రీజినల్, జోనల్​లెవల్​మేనేజర్లు సైతం ఉద్యోగాలు వదులుకున్నారని సమాచారం. దీంతో సొసైటీ పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. నిజంగానే కొవిడ్​ వల్ల కోలుకోలేని దెబ్బతగిలిందా? గతంలో చాలా సంస్థల్లో జరిగినట్టు ఇంకేమైనా ఆర్థికమోసం దాగి ఉందా? అన్నీ అనుమానాలే. సొసైటీ చీఫ్​ ప్రమోటర్లపైన హైదరాబాద్​లో ఎంక్వైరీ జరుగుతున్నట్టు తెలిసింది.