దేశవ్యాప్తంగా 55 శాతం మంది పాస్
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) పీజీ–2020 రిజల్ట్స్ ను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్ బీఈ) శుక్రవారం విడుదల చేసింది. పరీక్ష రాసిన వారిలో55 శాతం మంది క్వాలిఫై అయ్యారు. దేశవ్యాప్తంగా1,67,102 మంది నీట్ పీజీ పరీక్షకు అప్లై చేసుకోగా, వారిలో1,60,888 మంది హాజరయ్యారు. వీరిలో 89,549 మంది క్వాలిఫై అయినట్లు ఎన్ బీఈ ప్రకటించింది. తెలంగాణ నుంచి 8,649 మంది నీట్ పరీక్ష రాయగా 4,933 మంది క్వాలిఫై అయ్యారు. తమిళనాడు నుంచి అత్యధికంగా18,854 మందికి11,681 మంది పాస్ అయ్యారు. తర్వాత మహారాష్ట్ర నుంచి17,208 మందికి 8,832 మంది, కర్ణాటక నుంచి16,806 మందికి 9,792 మంది క్వాలిఫై అయ్యారు. చండీగఢ్ నుంచి145 మంది మాత్రమే నీట్ రాయగా, 115 మంది క్వాలిఫై అయ్యారు. ఆలిండియా50 శాతం సీట్ల కోటాకు సంబంధించిన మెరిట్ లిస్టును ఎన్బీఈ సెపరేట్గా విడుదల చేయనుంది.
మార్చి15 నుంచి అప్లికేషన్లు..
ఇక ఈ నెలలోనే ఆలిండియా స్థాయిలో మెడికల్ పీజీ ప్రవేశాలకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కానుంది. మన రాష్ట్రంలో మార్చి15 నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుందని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రైవేటు కాలేజీల్లో కలిపి1,624 మెడికల్ పీజీ సీట్లున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనే 760 వరకు ఉన్నాయి. ఇటీవలే నిజామాబాద్ మెడికల్ కాలేజీకి54 పీజీ సీట్లు వచ్చాయి. ఇవి కూడా ఈ ఏడాది నుంచే అందుబాటులో ఉంటాయని అధికారులు చెప్పారు.