కాజీపేట, వెలుగు : వరంగల్ ఎన్ఐటీ లో 2023-–24 అకడమిక్ ఇయర్ నుంచి నాలుగు సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ బీఎస్సీ - బీఈడీ డ్యుయల్ మేజర్ ప్రోగ్రామ్ ప్రవేశపెడ్తున్నట్లు నిట్ ఆఫీసర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ –2020 ప్రకారం నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలకు అనుగుణంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ లో ఈ ప్రోగ్రామ్ అందిస్తున్నామన్నారు. మూడు సంవత్సరాల కోర్సు తర్వాత భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం లేదా గణితంలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందేందుకు అనుమతిస్తుందన్నారు.
దేశవ్యాప్తంగా నాలుగు ఎన్ఐటీలు, రెండు ఐఐటీ లతో సహా 42 పెద్ద సంస్థల్లో అమలు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం ద్వారా విద్యా రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి మాట్లాడుతూ.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా కోర్సులో ప్రవేశాలకు ఎంపిక జరుగుతుందన్నారు. ఈ ప్రోగ్రాం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు www.nta.ac.in <http://www.nta.ac.in/>, <https://ncet.samarth.ac.in/>, <https://ncte.gov.in/> వెబ్సైట్లలో సందర్శించాలని
పేర్కొన్నారు.