రాజ్యాంగాన్ని మార్చే కుట్ర : ఆకునూరి మురళి 

రాజ్యాంగాన్ని మార్చే కుట్ర : ఆకునూరి మురళి 

నిజామాబాద్​, వెలుగు: రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసే కామెంట్లతో మత విద్వేషాలు రెచ్చగొడుతున్న ప్రధాని మోదీని పార్లమెంట్​ ఎన్నికల్లో ఓడించాలని రిటైర్డ్​ ఐఏఎస్​అధికారి ఆకునూరి మురళి అన్నారు. శుక్రవారం  జాగో తెలంగాణ, రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక (టీఎస్​డీఎఫ్​) బస్సు యాత్ర నిజామాబాద్  నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఐటీఐ కాలేజీ గ్రౌండ్​లో మార్నింగ్​ వాకర్స్​ను ఉద్దేశించి కోటగల్లి, బస్టాండ్​లో ఆయన మాట్లాడారు. దేశ సహజ సంపదను బడాపారిశ్రామిక వేత్తలకు దారాదత్తం చేసిన మోదీని గద్దె దించాలన్నారు.  

ఓటర్​ చైతన్యం కోసం రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర చేస్తున్నామన్నారు.  రాజ్యాంగాన్ని మార్చేసి, రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర చేస్తున్నారన్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల నుంచి ట్యాక్స్​ల రూపంలో రూ.12 లక్షల కోట్లను దోచుకొని రూ.16 లక్షల కోట్ల సొమ్మును అదానీ, అంబానీ​కంపెనీలకు కట్టబెట్టారని ధ్వజమెత్తారు.  ఏటా రెండు కోట్ల జాబ్స్​, బ్లాక్​ మనీ స్వాధీనం చేసుకొని పేదలకు పంచుతామనే హామీ ఎక్కడపోయిందని ప్రశ్నించారు. బీసీ గణన మరిచారన్నారు. ప్రొఫెసర్​ కె.లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్​ పద్మజ, ప్రజాపంథా నేత ఆకుల పాపయ్య, న్యూడెమోక్రసీ లీడర్లు శంకర్​ తదితరులున్నారు. 

ఆకునూరి ప్రసంగాన్ని అడ్డుకున్న వాకర్స్ 

ఐటీఐ గ్రౌండ్​లో మార్నింగ్​ వాకర్స్​ను ఉద్దేశించి ఆకునూరి మురళి ప్రసంగిస్తుండగా అక్కడున్న పౌరులు ఆయన్ను అడ్డుకున్నారు. ప్రధాని మోదీని ఎందుకు టార్గెట్​ చేసి కామెంట్లు చేస్తున్నారని ప్రశ్నించారు.  మోదీకి ఓటేయొద్దని ప్రచారం చేయడం బాగోలేదని అన్నారు.  తాము ఫలానా వారికి ఓటేయని చెప్పడం లేదని ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మార్నింగ్​ వాకర్స్​ మోదీకి  అనుకూలంగా నినాదాలు చేయగా ఆకునూరి మురళితో ఉన్న నేతలు వ్యతిరేక స్లోగన్స్​ఇచ్చి వెళ్లిపోయారు.