హైదరాబాద్, వెలుగు: మన దగ్గర తొక్కంటే మామిడే మైండ్ల మెదుల్తది. ఊర్లల్లో మామిడి తొక్కు పెట్టుకోని ఇల్లుండదు. అట్లాంటిది ఈసారి తొక్కు పెడదామంటే పచ్చడి కాయలు దొర్కుతలేవు. శెడగొట్టు వానలు పడి పంట దిగుబడి తగ్గడం, కరోనా లాక్డౌన్ వల్ల రవాణాకు కష్టమవడంతో మార్కెట్కు కాయలు చాలా తక్కువగా వస్తున్నాయి. వచ్చిన కాయలూ రేటు మస్తుగ పలుకుతున్నాయి. దీంతో పచ్చడి పెట్టుకోవడానికి జనం ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నరు.
సగానికి పైగా తగ్గిన దిగుబడి
రాష్ట్రవ్యాప్తంగా 3.07 లక్షల ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. ఈసారి 3.5 లక్షల నుంచి 4 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని ఉద్యాన శాఖ అధికారులు అంచనా వేశారు. ఎకరాకు 4 టన్నులు వస్తుందని లెక్కేశారు. కానీ కాపు లేక సగం కూడా రాలేదు. ఇటీవలి ఈదురు గాలుల వానలు, వడగండ్లకు మామిడి కాయలు రాలిపోయాయి.
50 శాతానికి పైగా తోటలు దెబ్బతిన్నాయి. దీంతో పచ్చడికి వాడే మామిడి రకాలకు కొరత ఏర్పడింది.మార్కెట్కు తక్కువొస్తున్నయ్ .రాష్ట్రంలో సిద్దిపేట, జనగాం, గజ్వేల్, జగిత్యాల, నిజామాబాద్, మహబూబ్నగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లా, ఆంధ్రా నుంచి హైదరాబాద్లోని బోయిన్పల్లి మార్కెట్కు పచ్చడి మామిడి కాయలు ఎక్కువగా వస్తుంటాయి. అక్కడి నుంచి గుడిమల్కాపూర్, ఎల్బీనగర్ మార్కెట్, మాదన్నపేట, సికింద్రాబాద్ మోండా మార్కెట్కు సరఫరా అవుతాయి. ఈసారి ఏప్రిల్ 25 నుంచి మే 3 వరకు సరాసరి రోజుకు 50 టన్నుల కాయలు దిగుమతి అయినట్టు మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు.
చిన్న కాయ కూడా రూ. 30
బోయిన్పల్లి మార్కెట్లో కిలో మామిడిని రైతు రూ.50కి అమ్మితే వినియోగదారుని వద్దకు వచ్చే సరికి ఒక్కో కాయ రూ. 50 వరకు పలుకుతోంది. చిన్న కాయను కూడా రూ.30కి తక్కువ ఇస్తలేరు. ఒక్కో కాయను కట్ చేయడానికి రూ.6 నుంచి రూ.12 వరకు వసూలు చేస్తున్నారు.
పచ్చడి కోసం ప్రత్యేక కాయలు
మామిడిలో నాటు కాయలు, జలాల్, కలెక్టర్, నీలాం, పరిగి, బారామసు తెల్ల గులాబీ, చక్కెర రసాలు, కోలం గోవా, సువర్ణ రేఖ, చక్కెర రసాలను తొక్కుకు వాడుతుంటారు. మామిడిలో పిక్క (టెంక) పెరగముందే పచ్చడికి ఉపయోగిస్తుంటారు.
చెట్లున్నా కొనాల్సిన పరిస్థితి
మాకున్న ఏడెకరాల తోటలో 3 మామిడి చెట్లున్నయ్. యేటా 50 కాయలు పచ్చడి పెట్టుకొని సుట్టాలకు తలా 30 చొప్పున 300 కాయులు ఇస్తుంటం. ఈ సారి చెట్లకు కాయల్లేవు. మేమే కొనుక్కున్నం -శశికాంత్రెడ్డి, మామిడి రైతు, ఖమ్మం జిల్లా
ఒక్క కాయ కాయలె
పోయిన ఏడాది ఓ చెట్టుకు 3 వేల కాయలు కాసినయ్. ఒక్కో కాయను రూ.15, రూ.20 చొప్పున అమ్మినం. ఈ సారి ఒక్క కాయ కాయలే. ఒక్కో కాయ రూ. 30 పెట్టి కొని పచ్చడి పెట్టుకున్నం.
– శ్రీనివాస్రెడ్డి, మహబూబాబాద్ జిల్లా