టోక్యో: కరోనా మహమ్మారి కారణంగా ఒలింపిక్స్ను మరోసారి పోస్ట్ పోన్ చేయాల్సి వస్తే.. తమ వద్ద ప్లాన్–బి లేదని నిర్వాహకులు మంగళవారం తెలిపారు. ప్రస్తుతానికైతే వచ్చే ఏడాది జులై 23 నుంచి ఒలింపిక్స్, ఆగస్ట్ 24 నుంచి పారాలింపిక్స్ జరుగుతాయనే ఆశాభావంతోనే ఉన్నామని గేమ్స్ స్పోక్స్ పర్సన్ మస టకాయా తెలిపారు. ‘మేం కొత్త గోల్స్పై వర్క్ చేస్తున్నాం. ఎందుకంటే మా వద్ద ప్లాన్–బి సిద్ధంగా లేదు. ఇప్పటికైతే ప్రకటించిన తేదీల్లోనే ఒలింపిక్స్, పారాలింపిక్స్ జరుగుతాయి. ఇందులో ఎలాంటి మార్పులేదు’ అని టకాయా పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో.. 15 నెలల టైమ్లో ఒలింపిక్స్కు సిద్ధం కావడం సాధ్యమేనా అని జపాన్ జర్నలిస్ట్లు అడిగిన ప్రశ్నకు టకాయా పైవిధంగా స్పందించారు. మరోవైపు ఇదే అంశంపై ఐఓసీ ప్రెసిడెంట్ థామస్ బాచ్ కూడా స్పందించారు. నేరుగా సమాధానం చెప్పకపోయినా.. టోక్యో ఒలింపిక్స్కు సంబంధించిన అన్ని వర్గాలు.. వచ్చే ఏడాది గేమ్స్ను విజయవంతం చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయని వ్యాఖ్యానించారు. వచ్చే సమ్మర్ వరకే గేమ్స్ను పోస్ట్ పోన్ చేశామని, అంతకంటే ఎక్కువగా మేనేజ్ చేయలేకపోయామన్నారు. ఫ్లయిట్స్, హోటల్స్ రీ బుకింగ్, స్టేడియం ఎరెనాలోకి ప్రేక్షకులను అనుమతించడం, సెక్యూరిటీ, వెన్యూస్కు సంబంధించిన చాలా అంశాల్లో ప్రశ్నలకు సరైన సమాధానం లభించలేదు. గేమ్స్ను రీ షెడ్యూలింగ్ చేయడం వల్ల నిర్వహణ ఖర్చు 2 నుంచి 6 బిలియన్ డాలర్లకు పెరిగిందన్న వార్తలపై కూడా ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు.